తెలంగాణ

విమోచనంపై ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: నిజాం నవాబును తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి, తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలన్న డిమాండ్ అధికార తెరాసకు ఇరకాటంగా పరిణమించింది.
తెలంగాణతో పాటు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన ఆ రెండు రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ స్వాతంత్య్రదినోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తూనే ఉన్నాయి. జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఎగురవేస్తున్నారు. ఇప్పుడు తెరాస అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా విమోచన/విలీన దినంగా ప్రకటించని వైనంపై విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.
తెదేపా-కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్ 17పై ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించలేదు. అధికారం కోల్పోయిన తర్వాతనే టిడిపి తెలంగాణ నేతలతో సెప్టెంబర్ 17న పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. బిజెపి మాత్రం అప్పటి నుంచి తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. తెదేపా ఎన్డీఏలో ఉన్న సమయంలో కూడా బిజెపి డిమాండ్‌ను బాబు పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలను విమర్శించారు. తెలంగాణ పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం మీకు చరిత్రగా కనిపించడం లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న మేమే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటిస్తూ వచ్చారు. కానీ కేసీఆర్ నేతృత్వంలో తెరాస అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా, ఇప్పటివరకూ సెప్టెంబర్ 17పై ఎలాంటి అధికార కార్యక్రమాలు నిర్వహించకుండా దాటవేస్తూ వస్తున్నారు.
తాజాగా సెప్టెంబర్ 17 సమీపిస్తుండటంతో విలీన/విమోచన దినంపై మళ్లీ డిమాండ్లు ఊపందుకుని, కేసీఆర్ సర్కారుపై అవి ఒత్తిడి పెంచుతున్నాయి. రెండురోజుల క్రితం కేంద్రమంత్రి దత్తాత్రేయ దీనిపై ఒక రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించగా, పాల్గొన్న వారిలో మెజారిటీ శాతం విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వంతో పనిలేకుండా కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకుని విమోచన దినంగా ప్రకటించాలన్న కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ మేరకు కేంద్రానికి వందల సంఖ్యలో వినతిపత్రాలు పంపారు.
తన కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న తెరాస, దానిని సచివాలయంలో ఎందుకు ఎగురవేయడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిలదీశారు. ఒకవైపు నిజాం, రజాకార్లపై పోరాడిన చాకలి ఐలమ్మను పొగుడుతూ, నిజాంను కీర్తించే కేసీఆర్ వైఖరి విచిత్రంగా ఉందని విమర్శించారు. ఈ విషయంలో విపక్షాలు కూడా బిజెపి దారి పడుతున్నట్లు కనిపిస్తోంది. 17న విమోచన దినంగా ప్రకటించాలని, దానివల్ల మైనారిటీల్లో వ్యతిరేకత ఏమీ రాదని ఏఐసిసి కార్యదర్శి వి.హన్మంతరావు డిమాండ్ చేశారు.
ఈ విషయంలో తెరాస సర్కారు పరిస్థితి ఇరకాటంగానే ఉంది. విపక్షాల డిమాండ్ మేరకు అధికారికంగా విమోచన లేదా విలీనదినంగా ప్రకటించినా, అది ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్న రాజకీయ కోణంలో వౌనం వహిస్తోంది. తెరాస సర్కారుకు మజ్లిస్ మద్దతునిస్తుండటంతోపాటు, తెలంగాణలో మైనారిటీలు తెరాసకు మద్దతుదారులుగా ఉండటమే దానికి కారణం. ఎంపి కవిత మాత్రం ఎదురుదాడి చేస్తూ బిజెపి తెలంగాణలో మతకల్లోలాలు కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17న అధికారికంగా ప్రకటిస్తే అది మత సమస్యగా పరిణమించే ప్రమాదం ఉన్నట్లు తెరాస ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.