తెలంగాణ

మళ్లీ చెరువుల పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: ఏప్రిల్ నెల మొదటి రెండు వారాల్లో రెండోదశ కింద ప్రజాప్రతినిధులందరూ చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొంటారని రాష్ట్ర సాగునీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. గురువారం వరంగల్‌లో మిషన్ కాకతీయ రెండోదశ కింద రూ.90లక్షల 82వేల వ్యయంతో చేపట్టిన పద్మాక్షి గుండం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్‌లో రూ.313 కోట్లతో మిషన్ కాకతీయ రెండోదశ కింద 524 చెరువుల పునరుద్ధరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. జిల్లాలో 418 కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ మొదటి దశ కింద 1075 చెరువుల పనులను చేపట్టినట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయ కింద మంచి ఫలితాలు సాధించి వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులతో నర్సంపేట, డోర్నకల్, ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో చెరువులు జలకళతో నిండి మంచి ఫలితాలు సాధించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రతి చెరువుకు మోడల్ అధికారిని నియమించి ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. భూగర్భ జలాలు పెంపొందించి రైతాంగానికి సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఏర్పాటు చేసుకున్న గ్రేన్ క్లైమెట్ ఫండ్‌కు దేశంలోని 29 రాష్ట్రాల నుండి పంపిన ప్రతిపాదనలో నాలుగు ప్రాజెక్టులు ఎంపికైతే అందులో మిషన్ కాకతీయ ఎంపికైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేందుకు ఇచ్చే గ్రేన్ క్లైమెట్ ఫండ్ నుండి దాదాపు 2వేల కోట్ల రూపాయలు గ్రాంట్ వచ్చే అవకాశం ఉందన్నారు.
మిషన్ కాకతీయ కింద గ్రామాల్లో నీటి లభ్యత కోసం చెరువుల పునరుద్ధరణ చేపట్టి రైతాంగం పొలాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని అన్ని చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ పనులు చేపట్టి చెరువులు జలకళతో నిండేలా చేయనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో చెరువులకు నీటిని చేరవేసే ఫీడర్ ఛానళ్లు మట్టితో నిండి వర్షంపడితే ఆ నీరు లోతట్టు ప్రాంతాలకు మళ్లుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని చెరువులను పునరుద్ధరణ చేసి పూడిక తీస్తే బోర్‌లలో అతి తక్కువ లోతులో నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. నగరంలో చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రతిపాదన మేరకు అత్యంత ప్రాచీనమైన పద్మాక్షి గుండం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం రూ.96లక్షల 70వేల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరు చేయగా 93లక్షల 40వేల రూపాయలతో సాంకేతిక అనుమతులు పొంది 90లక్షల 82వేల రూపాయలకు టెండర్లు పిలిచి ఒప్పందం కుదిరిందన్నారు. ఈ నిధులతో పద్మాక్షి గుండం చెరువు పూడిక పునరుద్ధరణతో పాటు బతుకమ్మ ఆడేందుకు రెండువైపుల మెట్లు, గణేష్ విగ్రహాలకు నిమజ్జనం చేసేందుకు ఫ్లాట్‌ఫాం నిర్మించుతున్నట్లు తెలిపారు. హృదయ్ పథకంలో మరో రెండు కోట్లు పద్మాక్షి చెరువుకు అభివృద్ధికి మంజూరు కానున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పిఎంకెఎస్‌వై కింద దేవాదుల ప్రాజెక్టును ఎంపిక చేసిందని, దీనికి నిధులు మంజూరు కానున్నాయన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు ఈ సంవత్సరం 2,500 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయనున్నామని, దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. కరువు కాలంలో 8టిఎంసిల నీటిని దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లోని చెరువులను నింపుకున్నట్లు ఆయన వెల్లడించారు. వరంగల్ నగర అభివృద్ధిలో భాగంగా నగర పాలక సంస్థకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఈ సంవత్సరం 300 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో వంద కోట్లు నగర పాలక సంస్థకు ప్రత్యేకంగా నిధులు రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నగర మేయర్ నన్నపనేని నరేందర్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జెసి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.