విజయనగరం

బిల్లు కట్టకపోతే పంచాయతీలకు పవర్‌కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, నవంబర్ 18: మండలంలోని 25 పంచాయతీలతోపాటు కోనమసివానిపాలెం పంచాయతీ కలిపి విద్యుత్ బకాయిలను సంబంధిత శాఖకు ఈనెల 25లోగా చెల్లించాలని కొత్తవలస విద్యుత్‌శాఖాధికారి బోకం రవి తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పంచాయతీల వారీగా విద్యుత్ సంస్ధకు రావాల్శిన బకాయిల జాబితాను విడుదల చేశారు. 2017 మార్చినెల నుండి నవంబర్ 2018వరకు గల బకాయిలను వివరించారు. మొత్తం 34,55,980 రూపాయలని తెలిపారు. 25లోగా చెల్లించకపోతే ఆయా పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. చాలా వరకు పంచాయతీలు కొద్దికొద్దిగా బకాయిలు చెల్లించారని చెప్పారు. 26 పంచాయతీలు 2017 మార్చి నుండి 2018 అక్టోబర్ వరకు 24,68,133 రూపాయలు బాకీ పడగా, నవంబర్ నెలలో 9,87,847 రూపాయలు బాకీ ఉన్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు వెంటనే స్పందించి బకాయిలు మొత్తం చెల్లించాలని తెలిపారు. గ్రామాల వారిగా బకాయిలు చూస్తే సుమారుగా కొత్తవలస 6.58 లక్షలు, దేశుపాత్రునిపాలెం 1.87లక్షలు, చింతపాలెం 1.87లక్షలు, చింతపాలెం 1.56లక్షలు, మంగలపాలెం 2.05లక్షలు, సంతపాలెం 44వేలు, గనిశెట్టిపాలెం 66వేలు, దెందేరు 16వేలు, గులివిందాడ 1.03లక్షలు, గొల్లలపాలెం 25వేలు, తుమ్మికాపల్లి 3.24లక్షలు, మసివానిపాలెం 1.87లక్షలు, ముసిరాం 75వేలు, రామలింగాపురం 1.07లక్షలు, దేవాడ 98వేలు, వియ్యంపేట 48వేలు, చీడివలస 68వేలు, వి.వి.పురం 2.77లక్షలు, చినరావుపల్లి 1.68లక్షలు, కాటకాపల్లి 1.05లక్షలు, కంటకాపల్లి 1.40లక్షలు, అప్పన్నపాలెం 51వేలు, ఉత్తరావల్లి 1.83లక్షలు, అప్పన్నదొరపాలెం 44వేలు, చిన్నిపాలెం 28వేలు, రెల్లి 63వేలు, నిమ్మలపాలెం 19వేల రూపాయలని తెలిపారు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
=======

చిరుధాన్యాల వినియోగంతోనే ఆరోగ్యం

కొత్తవలస, నవంబర్ 18: చిరుధాన్యాల వినియోగంతోనే ఆరోగ్యం సాధ్యమని రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను తప్పనిసరిగా తీసుకోవాలని సబలా సంస్థ కార్యదర్శి సరస్వతి తెలిపారు. దేశవ్యాప్తంగా వీటి వాడకం పెరుగుతుందని అన్నారు. ఈ మధ్య స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో చిరుధాన్యాల వాడకంపై విస్తృతస్థాయి సమావేశం జరిగిందని చెప్పారు. ప్రజల్లో వీటి వాడకంపై అవగాహన పెరగాలని అన్నారు. పూర్వపురోజుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు, వారి జీవన శైలి, ఆరోగ్య పరిస్థితులపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. భారతదేశంలో సుమారు 90శాతం మంది అనారోగ్య సమస్యలతో సతమవుతున్నారని చెప్పారు. అధిక శాతం ప్రజలు మధుమేహం, బిసి, ఒత్తిడి, కీళ్ళవ్యాధులతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. ఈ వ్యాధుల నుండి బయపడాలంటే తప్పనిసరిగా చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు.
గిరిజన సంక్షేమ, బిసి వెల్ఫేర్ హాస్టళ్ళకు చిరుధాన్యాలతో తయారైన తినుబండారాలను పంపుతున్నామని చెప్పారు. రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల సాగు పెంచుతున్నామని స్పష్టం చేశారు.

ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలి
* ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు

గంట్యాడ, నవంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 27న విజయనగరంలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయడానికి అందరు కృషి చేయాలని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. ఆదివారం గంట్యాడలోని దివంగత మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు స్వగృహం వద్ద గజపతినగరం నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ధర్మపోరాట దీక్షలో ప్రతి గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలను, ప్రజలు పాల్గొనేలా కృషి చేయాలని అన్నారు. అదే విధంగా గజపతినగరం నియోజకవర్గంతోపాటు జిల్లా మొత్తాన్ని కరవుగా ప్రకటించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి కోరామని తెలిపారు. జిల్లాలో అత్యధిక పార్టీ సభ్యత్వాలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో చేయనంతగా గజపతినగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, ప్రతి గ్రామంలోను చేసిన అభివృద్ధిపై చర్చ జరగాలని సూచించారు. కార్యక్రమంలో గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు, వివిధ కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
==============

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

పూసపాటిరేగ, నవంబర్ 18: మండలంలోని పాతకొప్పెర్ల గ్రామంలో ఉన్న గురుకుల విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. 1993-2001 ఏడాదిలో చదివిన విద్యార్థులు గురుకుల విద్యాలయంలో వేదికగా చేసి ఆత్మీయ అనురాగాలతో పులకించిపోయారు. వారు పాఠశాలల్లో చేదివే సమయంలో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూనే ఇప్పుడువారు సమాజానికి చేస్తున్న సేవలను నెమరు వేసుకుంటున్నారు. పూర్వ విద్యార్థులతో కలసి ఆయా కాలంలో పనిచేసిన ఉపాద్యాయులు కూడా పాల్గొని పూర్వ వైభవం స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త చంద్రావతి మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా కొప్పెర్ల గురుకుల విద్యాలయాలు, ఇతర సదుపాయలకు 33 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త ఆర్.డి.చంద్రశేఖర్, ఎంపీపీ చిన్నంనాయుడు, జడ్పీటీసీ ప్రసాదరావు, పలువురు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.