ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాలిటీల్లో ఆడిటింగ్ బద్ధకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఏళ్ల తరబడి ఆడిటింగ్ నిర్వహించడం లేదు. 13 కార్పొరేషన్లు, పలు మున్సిపాలిటీల్లో కొన్ని సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగాల్సి ఉంది. వేల కోట్ల రూపాయలకు సంబంధించి తగిన రికార్డులు సమర్పించకపోవడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చు చేయడం, బకాయిల వసూలు చేయకపోవడం వంటి అంశాలు పురపాలక శాఖ పాలన తీరును తెలియచేస్తోంది. లక్షల సంఖ్యలో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించకపోవడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సంస్థల్లో ఆడిటింగ్ జరగని వ్యవహారం మంత్రి యనమల సమీక్షలో వెలుగుచూసింది. వెలగపూడి సచివాలయంలో ఆడిట్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష ఆయన నిర్వహించారు. మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎపి హౌసింగ్ బోర్డువంటి సంస్థల్లో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను మూడు నెలల్లో పరిష్కరించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, విశ్వవిద్యాలయాల, టిటిడి, జిల్లా గ్రంథాలయ సంస్థలు, రైతుబజార్లు వంటి 17 సంస్థలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 31 వరకు రూ.16,276.08 కోట్లకు సంబంధించి 35,19,004 ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో చాలా ఏళ్లకు సంబంధించి ఆడిట్ పూర్తి కాలేదని, ఒక కార్పొరేషన్‌లో 12 ఏళ్ల నుంచి ఆడిట్ పెండింగ్‌లో ఉంటే మరికొన్ని కార్పొరేషన్లలో రెండేళ్లు, మూడేళ్లు ఆడిటింగ్ పెండింగ్ ఉన్నట్లు వివరించారు.
ఆయా సంవత్సరాలకు సంబంధించి లెక్కలను తేల్చలేదని చెప్పారు. మునిసిపాలిటీలకు వచ్చేసరికి కొన్నింటిలో 2,3,5 ఏళ్లకు ఆడిటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆయా సంవత్సరాలకు సంబంధించి జమాఖర్చులు కూడా పూర్తిగా రాయలేదని తెలిపారు. అయితే కార్పొరేషన్లలో, మునిసిపాలిటీల్లో ప్రస్తుత సంవత్సరం ఆడిటింగ్ మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి ఆడిట్ పూర్తికాకపోవడం, పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికి ఆడిట్ అభ్యంతరాలు ఏమీ ఉండకూడదని, ఈ లోపలే పరిష్కరించాలని చెప్పారు. దీనిని ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఆడిట్ అభ్యంతరాలు త్వరితగతిన పరిష్కరించడానికి అవసరమైన చోట స్టేట్ ఆడిట్ శాఖ నుంచి పదవీ విరమణ చేసిన వారిని ఒక ఆరు నెలలపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోమని చెప్పారు. ఈ పనికి ఆయా జిల్లాలకు చెందినవారిని తీసుకుంటే వారికి అక్కడ పరిస్థితులు తెలుస్తాయని మంత్రి సలహా ఇచ్చారు. నిధులు దుర్వినియోగం, తప్పుగా వినియోగించిన, అధికంగా చెల్లింపులు చేసిన, నిధులు వృధా చేసిన అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థలు, ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పేరుకుపోయిన ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన లెక్కలను సమర్పించి, మూడు నెలల లోపల ఆడిట్‌ను పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. అన్ని సంస్థలు నిధులు వినియోగం, జమాఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆయా సంస్థలు గడచిన సంవత్సరాలకు సంబంధించిన జమాఖర్చుల వివరాలు, ఆడిట్ అభ్యంతరాలకు తగిన వివరణలు పంపిన ఒకటి, రెండు నెలలలోపు ఆడిట్‌ను పూర్తి చేయాలన్నారు. నిధుల వినియోగం లెక్కల సమర్పణ, ఆడిటింగ్ ఏ మేరకు జరిగిందో పరిశీలించి ఇకముందు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న లెక్కలు తేల్చడానికి, ఆడిట్ అభ్యంతరాలు పరిష్కరించడానకి ఒక విభాగం, ప్రస్తుత జమాఖర్చుల వివరాల నమోదు, ఆడిటింగ్‌కు మరో విభాగాన్ని ఏర్పాటు చేసుకొని త్వరగా ఆడిటింగ్ పూర్తి చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆడిట్ అభ్యంతరాలను మూడు నెలల్లో పరిష్కరించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, ఆడిట్‌శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.