సబ్ ఫీచర్
జానకీ రాముడు జగతికి ఆరాధ్యుడు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/15b1.jpg?itok=v4P5pFiQ)
శ్రీరాముడు భారతీయులకు ఆదర్శప్రాయమైన ఆరాధ్య దైవం. త్రేతాయుగంలో పవిత్ర సరయూనది ఒడ్డున గల అయోధ్యా నగరాన్ని ఇక్ష్వాకు వంశీయులు దాదాపు నలుబది మంది రఘు వంశ రాజులు పాలించారు. వారిలో మొదటిరాజు చతుర్ముఖ బ్రహ్మ, చివరివారు కుశలవులు. ఇందులో రఘు వంశానికి వన్న తెచ్చిన వారు మరీచి, కశ్యపుడు, త్రిశంకు, మాంధాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, అజుడు, రామలక్ష్మణులు. రామలక్ష్మణులు విష్ణు అంశంతో యాగఫలంగా జన్మించి రఘు వంశమును ఆ చంద్రార్కంగా ప్రజలచే ఆరాధింపబడే విధంగా రామరాజ్యం చేసి భారతావని ఉన్నంతకాలం వారి పేరు స్మరించే విధంగా ప్రజలను పాలించారు. ఆ రామచంద్రుని జన్మదినము, కళ్యాణదినము చైత్ర శుద్ధ నవమి. కావున చైత్ర శుద్ధ నవమి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొన్నది.
సౌందర్యరాశి, సుకుమార నిధి, లావణ్యవతియైన సీతాదేవి, అయోనిజ యాగ క్షేత్రములో జనక మహారాజుకు నాగటి చాలులో లభించినందున ‘సీత’గా నామకరణం చేశారు. సీత అనగా నాగటి చాలు. సీతారాముల వివాహం లోక కళ్యాణదాయకమైన నవమి నాడు వైభవోపేతంగా జరిగినది. భారతావనిలోని హిందువులందరూ ఆ దేవదేవుని పుట్టుక, కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ఆనందోత్సాహాలతో ఆ సేతు హిమాచల పర్యంతం జరుపుకోవటం సాంప్రదాయమైన ఆచారంగా మారింది.
శ్రీరామ జయగాధ భారతీయ గౌరవాన్ని, జ్ఞాన వైరాగ్యాలు, సదాచారం, నీతి నియమాలు, ధర్మం, సోదరప్రేమ, మిత్రత్వము మొదలగు అనేక అంశములతో ముడివడి యున్నది. రామకథలో రామచంద్ర ప్రభువు త్యాగనిరతి, ధర్మపాలన, పితృవాక్యపాలన, సత్యవాక్యపాలన ప్రజలను కన్నబిడ్డలవలె చూచి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రజానురంజకంగా పాలించిన తీరు ఇమిడి యున్నది. రామకథతో విభిన్న పరిస్థితులలో సమాజంలో ప్రవర్తించవలసిన అనేక అంశాలపై అవగాహన కలుగుతుంది. రామకథలో ప్రతిజ్ఞాపాలన, మహోన్నతమైన రాజధర్మం, ఆదర్శ జీవనంతోపాటు సామాజిక, నైతిక, ధార్మిక విషయాలు, పుత్ర వాత్సల్యం, గురుశిష్యుల సంబంధాలు, భార్యాభర్తల ప్రేమానురాగాలు నియమాలు పొందుపరచారు. అంతేకాకుండా గుహుని ప్రేమానురాగం, సేవానిరతి, భరతుని నిరుపమానమైన సోదర వాత్సల్యం, ఆత్మీయత, అనురాగం, సుగ్రీవుని స్నేహశీలత, హనుమ సాటిలేని స్వామిభక్తి, రాక్షస జాతి యందు జన్మించినా విభీషణుడి అసాధారణ ధర్మతత్త్వము, న్యాయదృష్టి, లక్ష్మణుడి సోదర భావం, సీతాదేవి ఆదర్శ పాతివ్రత్యం, ఏ వివాదమునైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని హితవు పలుకుతోంది. అంగద రాయబారములోని విజ్ఞత మనకు మార్గదర్శకాలు. అందుకే రాముడన్నా రామగాథను తెలిపే రామాయణమన్నా హిందువులకు అత్యంత ప్రేమ, పవిత్రం.