తూర్పుగోదావరి

అంతంతమాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వామపక్ష, వైసిపి, ఆమ్ ఆద్మీ, ఇతర ప్రజాసంఘాలు సోమవారం చేపట్టిన బంద్ ప్రభావం జిల్లాపై అంతంత మాత్రంగానే చూపింది. బంద్ సందర్భంగా పౌరసేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు యధావిధిగా సేవలందించాయి. ఆర్టీసి బస్సులు, ఆటోలు అన్నీ తిరిగాయి. వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ పెద్దనోట్లను రద్దుచేసి సామాన్య ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్నారు. సామాన్యులను ఇబ్బందుల పాల్జేసి కార్పొరేట్లకు 7 వేల కోట్లకు పైగా ఉన్న బ్యాంకు రుణాలను ప్రధాని మోదీ మాఫీ చేయించి వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. దేశంలో నల్లధనం ఉందని గగ్గోలు పెట్టిన మోదీ 2 వేల నోటు ఎవరికోసం తీసుకువచ్చారో తెలపాలని బాబ్జీ డిమాండ్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళంరాజు మాట్లాడుతూ 84 శాతం చలామణీలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. మోదీకి అవగాహన లేకపోవడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ కార్పొరేట్ల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నల్లధనాన్ని వెలికితీయడంలో కేంద్రం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని, దీనికి వారు నోట్ల రద్దు డ్రామా ఆడుతున్నారన్నారు. వైసిపి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ళ ర్యాలీని కలెక్టరేట్ వరకు నిర్వహించారు. అంతకుముందు తలలేని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసన తెలుపుతూ తలలేని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాల్లో వామపక్ష, వైసిపి, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక బాలాజీ చెరువు వద్ద సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు బస్సులను ఆపి నిరసన వ్యక్తం చేశారు.
కిటకిటలాడిన రత్నగిరి
శంఖవరం, నవంబర్ 28: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి సన్నిధి రత్నగిరి సోమవారం భక్తజన సంద్రంగా మారింది. పవిత్ర కార్తీకమాసంలో చివరి సోమవారం కావడంతో త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన శ్రీ సత్యనారాయణస్వామిని దర్శించేందుకు, స్వామివారి వ్రతమాచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రత్నగిరి చేరుకున్నారు. స్వామివారి వ్రతాలను వేకువ జాము నుండే ప్రారంభించగా, సోమవారం ఒక్క రోజే సుమారు 7 వేల వ్రతాలు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే దేవస్థానం ఇఓ కాకర్ల నాగేశ్వరరావు ముందస్తు చర్యలు చేపట్టి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధిక సంఖ్యలో హాజరై క్యూలైన్లు కట్టిన భక్తులకు టెంట్‌లు ఏర్పాటుచేసి, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
అక్రమ మార్పిళ్లపై కన్ను
రాజమహేంద్రవరం, నవంబర్ 28: కేంద్రప్రభుత్వం రద్దుచేసిన పెద్దనోట్లను అక్రమంగా మార్పిడి చేసుకునే వారిపై కనే్నసి ఉంచాలని ఎస్పీ బి రాజకుమారి బ్యాంకర్లకు సూచించారు. అలాంటి వివరాలను తమకు తెలియజేస్తే వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పెద్దనోట్ల రద్దు, చిల్లర కొరత నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం రాత్రి ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో నగరంలోని బ్యాంకు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈసమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్యాంకు అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తే ప్రజల ఇబ్బందులను పరిష్కరించవచ్చన్నారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచాలన్నారు. అక్రమ లావాదేవీల నిరోధానికి బ్యాంకులు, ఎటిఎంలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. వచ్చేనెల మొదటి వారంలో పెన్షనర్లు, ఉద్యోగులు జీతాలు తీసుకునే అవకాశం ఉన్నందున బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 2-3రోజుల్లో రిజర్వు బ్యాంకు నుంచి రాజమహేంద్రవరంనకు రానున్న కొత్త రూ. 500 నోట్లను భద్రంగా బ్యాంకులకు చేరేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదురహిత లావాదేవీలపై బుధవారం అర్బన్‌జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ల పరిధిలో పోలీసులు, బ్యాంకర్లు, స్థానికులు, వర్తకులతో కలిసి అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ ఆర్ గంగాధర్, డిఎస్పీలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
రబీకి నీటి సమస్య రానివ్వం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 28: జిల్లాలో రబీ సీజన్‌లో రైతులకు నీటి సమస్య ఎదురుకాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ చెప్పారు. వ్యవసాయ, ఇరిగేషన్ శాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు నీటిని పూర్తిస్థాయిలో అందించాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో రబీ సీజన్‌కు సంబంధించి ఇరిగేషన్, వ్యవసాయ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. రబీ సీజన్‌లో 1,59,977 హెక్టార్లలో వరి పండిస్తున్నట్టు చెప్పారు. దీనికి ఏలేరు, గోదావరి జలాశయాల్లో సరిపడే నీరుందన్నారు. వరి పండిస్తున్న ప్రాంతాల్లో రెండు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులను పరిస్థితులు అడిగి తెలుసుకుని, సమస్యలు రాకుండా సమీక్షించాలన్నారు. వ్యవసాయ శాఖాధికార్లు శివారు ప్రాంతాల్లో కూడా పర్యిటిస్తూ రైతులతో మాట్లాడి ఆయా సమస్యలను ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని సూచించారు. డిసెంబరు 31వ తేదీ నాటికి నారు వేయడం, వెదజల్లడం, నాట్లు వేయడం తదితర పనులు పూర్తి కావల్సి ఉంటుందన్నారు. కెనాల్ లాకుల వద్ద లీకేజీలు లేకుండా, షట్టర్లు మరమ్మతులకు గురికాకుండా చూడాలని, ఇందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులకు కచ్చితమైన సమాచారాన్నివ్వాలని వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు. నీటి కొరత ఎక్కడైనా ఉంటే వ్యవసాయ శాఖ ఎడిలు పరిశీలించి, ప్రత్యేక శ్రద్ధతో నీటి సరఫరాకు చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. రబీకి కావల్సిన విత్తనాలన్నీ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వర్మీ కంపోస్ట్ పాండ్స్ పనులకు సంబంధించి రైతులను చైతన్యపరచి, జిల్లా లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. వరి సాగు చేయని ప్రాంతాల్లో పెసలు, మొక్కజొన్న, మినుములు, శెనగలు వంటి విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఆ అత్తానికి మూడు డజన్లు!
రాజవొమ్మంగి, నవంబర్ 28: అరటిగెలలో ఓ అత్తానికి మూడు డజన్ల అరటి పళ్లు కలిగి ఉండడంతో కొనుగోలు చేయడానికి భక్తులు పోటీ పడిన సంఘటన రాజవొమ్మంగిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక అప్పారావు అరటి గెలల దుకాణంలో ఈ అత్తం రెండు వందల రూపాయలకు భక్తులు పోటీపడి కొన్నారు. కార్తీక సోమవారం తమకు ఈ అరటి పండ్లు లభించడం భక్తులు వారి అదృష్ణంగా భావించారు.
రాజమహేంద్రవరంలో పాక్షిక బంద్
రాజమహేంద్రవరం, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్, వైసిపి, వామక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఆక్రోశ దినంగా పాటించి, హర్తాళ్ నిర్వహించారు. ప్రతిపక్షాల బంద్‌కు చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో నగరంలోని పలుచోట్ల దుకాణాలు మూతపడ్డాయి. అయితే బంద్ పాక్షికంగా జరిగింది. సినిమాహాళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పాఠశాలలు యధావిధిగా పనిచేశాయి. సాయంత్రానికి యధావిధిగా దుకాణాలను తెరిచారు. ఆక్రోశ దినాన్ని పురస్కరించుకుని చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు అశోక్‌కుమార్‌జైన్, బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు, నందెపు శ్రీనివాస్, వైసిపి నాయకులు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరావు, కాంగ్రెస్ నాయకులు ఎస్‌ఎన్ రాజా, ఎన్‌వి శ్రీనివాస్, సిపిఐ నాయకులు రావుల వెంకయ్య, మీసాల సత్యనారాయణ తదితరులు స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి శ్యామలాసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు ర్యాలీగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పెద్దనోట్ల రద్దు, నగదురహిత లావాదేవీల వల్ల పడుతున్న ఇబ్బందులను సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్‌కు వివరించి, వినతిపత్రాన్ని సమర్పించారు. పెద్దనోట్ల రద్దు వల్ల చిల్లర సమస్య తలెత్తి చిన్నవర్తకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దును అనాలోచిత చర్యగా అభివర్ణించారు. మరోవైపు నగదురహిత లావాదేవీలపై అధికారులు తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రూ. 50, 100 నోట్లను పెద్దసంఖ్యలో చెలామణిలోకి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ పాలన తుగ్లక్‌ను తలపిస్తోందని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ సిపిఎం కార్యకర్తలు కోటగుమ్మం నుంచి శ్యామలాసెంటర్ వరకు బైక్‌ర్యాలీని నిర్వహించారు. డివిజన్ కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్ భీమేశ్వరరావు నాయకత్వం వహించారు. ఎన్ రంగ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. కె జోజి, ఎవి రమణ, కె అప్పారావు ధర్నాకు నాయకత్వం వహించారు.
కొత్తపేటలో ఉద్రిక్తత
కొత్తపేట: పాతనోట్ల రద్దుపై వామపక్షాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ కొత్తపేటలో సోమవారం విఫలమయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చినా ఆ పార్టీ నాయకులు కానరాలేదు. అయితే వైసిపి ఈ బంద్‌కు మద్దతునిచ్చి షాపులను కొద్దిసేపు మూయించివేసింది. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి బంద్ పాటించాల్సిందిగా వ్యాపారులను కోరారు. షాపులను మూయించే సందర్భంగా మారుతీ సెంటర్‌లో మట్టపర్తి గౌరీమాణిక్యంకు చెందిన టీ స్టాల్‌పై కొందరు దాడికి దిగటంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం స్థానిక పాత బస్‌స్టాండ్‌కు చేరుకొని అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న అధికార్లను బయటకు పంపే సందర్భంలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. తహసీల్దార్ ఎన్ శ్రీ్ధర్ తో వైసిపి నాయకులు వాగ్వివాదానికి దిగారు. కొందరు వైసిపి కార్యకర్తలు కార్యాలయంలో ఉన్న కుర్చీలను బయటకు విసిరివేశారు. అక్కడే ఉన్న ఎస్సై డి విజయ్‌కుమార్, సిబ్బంది వైసిపి నేతలను వారించారు.
వైసిపి నేతలపై కేసు నమోదు
బంద్ సందర్భంగా మారుతీ సెంటర్‌లో ఒక షాపుపై దాడికి పాల్పడినట్లు షాపు యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసిపి నాయకులు గొల్లపల్లి డేవిడ్‌రాజు, బాలుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై డి విజయ్‌కుమార్ తెలిపారు.
దాడిని ఖండించిన టిడిపి
బంద్ సందర్భంగా వైసిపి నాయకులు దాడికి పాల్పడిన ఘటనను దేశం నాయకులు తీవ్రంగా ఖండించారు. వికలాంగ దంపతులపై వైసిపి నాయకులు దౌర్జన్యం చేశారని, అమాయకులపై దాడులు చేయటం వారికి అలవాటైందని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార్లను సైతం బెదిరించడాన్ని దేశం నాయకులు ముత్యాల బాబ్జీ, కంఠంశెట్టి శ్రీనివాస్, మిద్దే ఆదినారాయణ, బూసి భాస్కరరావు, గుబ్బల మూర్తి, రాయుడు శేఖర్ ఖండించారు.
మండపేటలో...
మండపేట: పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్ట్భారామయ్యచౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ రైతు విభాగ కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ తదితరులు సోమవారం మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల్లో తిరుగుతూ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపి దుకాణాలు మూయించి కలువపువ్వు సెంటరు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్ట్భా రామయ్యచౌదరి మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యుడు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ఒక్కసారిగా నోట్లు రద్దు చేయడం దారుణమన్నారు. సిఐ హ్యాపీ కృపానందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసుస్టేషనుకు తరలించారు. అలాగే మరో వైసిపి నాయకుడు వేగుళ్ల లీలాకృష్ణ, పిసిసి అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావు, సిపియం అనపర్తి నియోజకవర్గ నాయకుడు చండ్రమళ్ల పద్మ, ఐఎఫ్‌టియు నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
కిటకిటలాడిన పంచారామ క్షేత్రాలు
రామచంద్రపురం, నవంబర్ 28: ద్రాక్షారామలోని భీమేశ్వరస్వామి ఆలయానికి ఆఖరి కార్తీక సోమవారం భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయంలో అర్చకులు భీమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జస్టిస్ రామలింగేశ్వరరావు కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయం వద్ద అర్చకులు మద్దిరాల సుబ్బారావు, ఇఒ చలపతిరావు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆయన వెంట రామచంద్రపురం జ్యుడీషియల్ అధికారులు నాగిరెడ్డి శ్రీనివాస్, రామకృష్ణ, లక్ష్మీకుమారి, డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ, బార్ సంఘ ప్రతినిధులు ఉన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు స్వామివారిని దర్శించుకుని, అభిషేకాలు, పూజలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ద్రాక్షారామ ఏరియా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, పేపకాయల సత్యనారాయణ (బాబ్జీ) నేతృత్వంలో భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదాన సత్రంలో ఫౌండరీ మెంబర్ శ్రీ పైండా సుబ్రహ్మణ్య జగన్నాథ సత్యప్రసాద్ జమీందార్ పర్యవేక్షణలో అన్నదానం జరిగింది. రామచంద్రపురం సిఐ కొమ్ముల శ్రీ్ధర్ కుమార్ నేతృత్వంలో ఎస్సైలు, సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
ఒకే రోజు కాశీ, దక్షిణ కాశీ
ద్రాక్షారామలో ఎమ్మెల్యే తోట అభిషేకాలు
స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యులతో ఒకే రోజు ఉదయం ప్రఖ్యాత కాశీ పుణ్యక్షేత్రంలో, సాయంత్రం దక్షిణ కాశీ ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఒకే రోజున ఉత్తరాదిన కల కాశీలోనూ, దక్షిణాదిన గల కాశీ పుణ్యక్షేత్రంలోనూ అభిషేకాలు నిర్వహించుకోవడం విశేషం.. గతంలో పలుమార్లు పంచారామ క్షేత్రాలను, త్రిలింగ క్షేత్రాలను ఒకే రోజున సందర్శించిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉత్తర, దక్షిణ కాశీలను ఒకే రోజున సందర్శించుకుని భక్తిప్రపత్తులు చాటుకోవడం గమనార్హం. ద్రాక్షారామ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం బేడా మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
భీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
సామర్లకోట: కార్తీకమాసం చివరి సోమవారం సామర్లకోట పంచారామక్షేత్రం భీమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి నుండి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి పుష్కరిణిలో, గోదావరి కాల్వలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయం వద్ద బారులు తీరారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు వినాయక పూజ, స్వామివారి యోగలింగానికి పిఠాపురం మహారాజా గోత్రనామాలతో అర్చకబృందం తొలి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అయిదు గంటలకు 60కు పైగా బస్సుల్లో యాత్రీకులు తరలివచ్చారు. సాయంత్రం ఆరు గంటల వరకు సుమారు 30వేల పైబడి భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆలయం వద్ద ఇఒ పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్‌మోహన్(బాబు), ట్రస్టుబోర్డు సభ్యులు పర్యవేక్షించారు. సిఐ ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్సై ఆకుల మురళీకృష్ణ, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
భీమేశ్వరుని సేవలో మంత్రి రాజప్ప దంపతులు
సామర్లకోట, నవంబర్ 28: స్థానిక పంచారామక్షేత్రం భీమేశ్వరాలయంలో సోమవారం ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి రాజప్ప దంపతులకు ఇఒ పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్‌మోహన్ (బాబు) పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత స్వామివారి యోగ లింగానికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంది మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందచేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు దూది రాజుబాబు, మహంకాళి వెంకట గణేష్, పడాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
కంచి స్వాముల సేవలో మంత్రి
పిఠాపురం రోడ్డులోగల కంచి మహా సంస్థానం అధ్యక్షుడు చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్ర్తీ గృహంలో కంచి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిని మంత్రి రాజప్ప దంపతులు కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి స్వగృహంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు విచ్చేసిన కంచిస్వాములను మంత్రి రాజప్ప దంపతులకు గణపతిశాస్ర్తీ పరిచయం చేశారు.
కంచి పీఠాధిపతులకు ఘన స్వాగతం
సామర్లకోట విచ్చేసిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామికి సోమవారం గాంధీ బొమ్మ సెంటరు వద్ద కంచి మహా సంస్థానం అధ్యక్షుడు చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్ర్తీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. గణపతిశాస్ర్తీ ఇంటివరకు భారీ ప్రదర్శనగా స్వామీజీలు తరలివచ్చారు. అనంతరం గణపతిశాస్ర్తీ గృహంలో జయేంద్ర సరస్వతిస్వామి భక్తులకు విబూది, కుంకుమ పంపిణీ చేశారు.