మంచి మాట

వర్ణాశ్రమ ధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపౌరుషేయాలైన వేదములు మంత్ర ద్రష్టలయిన ఋషులచే పూర్ణమయిన అనంతము నుండి గ్రహింపబడి తమ స్మృతి పథం లో నిక్షిప్తపరుచుకొని తరతరాలకు అందించబడినది. వేదవ్యాసులు వాటిని లిఖించి మానవాళికి మహోపకారం చేసారు. సర్వకాల సర్వావస్థలయందు ఎంతో నియమనిష్టలతో తమజీవితాలను క్రమశిక్షణకు అంకితం చేసి వేదనిథిని కాపాడుకుంటూ వచ్చిన ఋషిపుంగవులకు ఎంతో ఋణపడి ఉంది మన భరతజాతి. నక్షత్రకాంతి తమపై ప్రసరించుచుండగా నదీప్రవాహములో నడుము లోతు నీటిలో నిలబడి వేదాలను అధ్యయనం చేయుట ఒక తపస్సు. సర్వభోగాలను త్యజించి ప్రకృతి యే భగవంతుడనే సత్యాన్ని కనుగొనుటకు నిత్యం శ్రమించారు. ప్రకృతిని అనేక దేవతా స్వరూపాలుగా భావన చేసి మానవుని ఉనికిని శాశ్వతం చేశారు.
జ్ఞానమనే సంస్కారాన్ని మానవుడిలో నిక్షిప్తం చేశారు. నాగరికతకు నేపథ్యం వేదజ్ఞానమే అనుటలో సందేహపడవలసిన అవసరం లేదు.
ఈర్ష్యాపరులైన కొందరు తమ ప్రాబల్యం నిలుపుకొనుటకు అసురప్రవృత్తితో వేద విజ్ఞానాన్ని చిన్న చూపు చూసేలా ప్రచారం చేయుట జరిగినది. కాని అవి కాలగమనము లో నిలబడలేదు. భగవంతుని ప్రసాదమైన వేదముల నుండి జనించిన పురాణ ఇతిహాసములు, ఉపనిషత్తులు మనకు ఎన్నో దైవారాధనా ప్రక్రియలను అందించినవి. ఈనాడు దేవాలయాల్లో నెరవేర్చు అనేక అర్చనా విధానములు, క్రతువులు అత్యంత మహిమాన్విత మైనవి. వాటి యొక్క ప్రాధాన్యత, మహిమ ఎంతో నియమ నిష్టలతో నెరవేర్చుకోలేవు. ఆగమ శాస్త్ర ఉద్ధండులైన పండిత పూజారులకు మాత్రమే అవగతము. అటువంటి శాస్తబ్రద్ధులైన పండితోత్తములు మాత్రమే అర్చకులుగా అర్హులు. అపుడే వాటి ఫలితము ప్రజలందరికి సంపూర్ణముగా లభిస్తుంది. కులమత సంబంధము లేకుండా ఎవరైతే అటువంటి వైదిక ఆగమ పరంపరలో వస్తారో వారే ఈ ప్రవృతికి సంపూర్ణ అర్హులు. ఇక కులప్రస్థావన నేరుగా మన సనాతన ధర్మములో ఎక్కడా లేదు.వర్ణాశ్రమ ధర్మాలు మాత్రము నిర్దేశించబడ్డాయి. గీతలో భగవానుడు చెప్పినట్లు. చాతుర్వర్ణం మయా స్పష్ట గుణకర్మ విభాగశః
... గుణములను బట్టి తాము చేపట్టే కర్మలను అనుసరించి నాలుగువర్ణములుగా మానవులు విభజించబడ్డారు. త్రిగుణముల ఆధారముగా సత్యప్రధానమైన శమము, దమము, తపము ఎవరైతే అనుసరిస్తారో వారు బ్రహ్మ జ్ఞానులు. రజోగుణ ప్రధానమైన శౌర్యమును అనుసరించువారు క్షత్రియులు. తేజమును అనుసరించువారు వైశ్యులు. తమోగుణ ప్రధానమైన సేవాభావము కలవారు శూద్రులు. కొంతమంది స్వార్థబుద్ధులు ఈ వర్ణములను కులముగా మార్చి సమాజమును భ్రష్టుపట్టించిరి.
వేదాధ్యయనమునకు క్షాత్ర లక్షణములకు ఎంతో త్యాగము తెగువ, క్రమశిక్షణ అవసరము. అటువంటి కఠోరమైన శిక్షణలను పాటించలేని సోమరులు భోగ లాలసులు వాటిని సాధించలేక వర్ణవిమర్శ చేయుట పరిపాటి అయినది. తుదకు అసూయా ద్వేషములతో వర్ణసంకరము చేయుటకు కూడా కుట్ర పన్నుట కడు శోచనీయము. కృష్ణ్భగవానుడు సృజియించిన ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో మానవుడనే వాడు ఎవడైనా ఆయా గుణములను సాధన చేసి తదనుగుణవర్ణములో ప్రవేశించవచ్చు. అశక్తుడయినచో ఆ వర్ణము నుండి నిష్క్రమించవచ్చు. అంతియే గాని పుట్టుకతోనే వర్ణము నిర్దారించబడదు. జన్మ నా జాయతే శూద్రః కర్మణా జాయాతే ద్విజః అని స్మృతి తెలియ చేసింది. పుట్టుకతో అందరూ శూద్రులే. నియమ నిష్ఠలతో భోగ త్యాగము చేసి వేదాధ్యయనము చేయుచూ లౌకిక విషయాసక్తులు కాని వారు ద్విజత్వము ను పొందుదురు. బ్రహ్మజ్ఞానము గల ఈ ద్విజులు మిగిలిన వర్ణముల వారికి దిశానిర్దేశము చేయగలరు. సత్వగుణ ప్రధానుడైన బ్రహ్మ జ్ఞాని సకల శాస్త్రాలను సృజించ శక్తి గల వాడై మానవ సమాజము సుఖ సంతోషాలతోమనుగడ సాగించుటకు తగిన ప్రణాళిక వేయగలడు. స్ర్తిపురుష సంయోగమే మరొక జన్మకు కారణం తప్ప కులము కాదు. చరిత్రలో రాజ్యము లేలిన రాజులందరూ క్షత్రియ కులము వారే కాదు క్షాత్ర గుణమును బట్టి రాజులయినారు. వేదాలను అధ్యయనము చేసిన బోయలు బ్రహ్మజ్ఞానులైనారు. పరమ నైష్ఠకుడైన కౌశికునకు ధర్మవ్యాధుడు ధర్మబోధ చేసి బ్రహ్మజ్ఞాని అయినాడు. కావున చక్కని సమాజమునకు వర్ణాశ్రమధర్మములు ఎంతో ముఖ్యం. వీటికంటే సర్వజనీనము, సర్వజన సమ్మతము అయిన ధర్మాచరణ ఎంతో ముఖ్యం. అదియే మన భరతజాతికి శ్రీరామరక్ష.

- వారణాశి వేంకట సూర్య కామేశ్వరరావు