విజయవాడ

శబ్ద చమత్కార కవి... వేంకట కవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

17వ శతాబ్ది ప్రథమార్ధంలో తంజావూరు రఘునాథ భూపతి ఆస్థానంలో చేమకూర వెంకటపతి అనే కవి వుండేవాడు. ఆయన శృంగార రస ప్రధాన గ్రంథాలు రెండు రాశాడు. మొదటిది సారంగధర చరిత్ర. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం అవటం వల్ల అంత బాగా కుదరలేదు. అయినా కొన్ని పద్యాలు అద్భుతంగా వుంటాయి. మచ్చుకొక పద్యం.
కలరా యిలరాయనికిం
కులసతి రత్నాంగి భోగ కుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు నన
నెల జవ్వను లిరువు రంబుజేందు నిభాస్యల్.
ఆ రాజుకు కులసతి రత్నాంగి, భోగ కుటిల శిరోజా తిలకము చిత్రాంగి అని ఇద్దరున్నారు. రత్నాంగి భార్య, చిత్రాంగి ఉంపుడుగత్తె. ఇద్దరూ వయస్సులో వున్నవారే. వారు అంబుజేందు నిభాస్య లన్నాడు. ఇది క్రమాలంకారం. రత్నాంగి ముఖం పద్మము వలెనూ, చిత్రాంగి ముఖం చంద్రుని వలెనూ వున్నవని భావం. అంటే వీళ్లిద్దరికీ పడదని తాత్పర్యం. పద్మం వుంటే చంద్రుడుండడు. చంద్రుడుంటే పద్మము వుండదు. ఇదీ కవి చేసిన చమత్కారం. మరొక పద్యం. యువరాజు సారంగధరుడు పావురము నిమిత్తం చిత్రాంగి ఇంటికి వెళ్తాడు. అప్పుడతనిని చూసి ఆమె మోహిస్తుంది. ఆ ఘట్టంలోని పద్యం.
చందురునిన్ జయంతుని వసంతుని కంతుని ఆదిగా జనుల్
కొందరు మోహనాంగులను కోవిని పోవుటెగాని చూడలే
దెందును వారి రూపమది ఎట్టిదియో యిదే నిన్నుగంటి నా
నందముగాగ నేడు సుదినంబుగ నా సదనంబు రంజిలెన్
ఈ పద్యంలో శబ్దాలంకారం ఎంతో హృద్యంగా వుంది.
ఇక రెండో గ్రంథం విజయవిలాసము. తెనుగు భాషాభిమానులెవరైనా ఈ పుస్తకాన్ని చదువకుండా విడువరు. ఇందులో వేంకటకవి పద్యాల్ని పట్టాలెక్కించి పరుగెత్తించిన తీరు అమోఘం. ప్రతి పద్యం ఆణిముత్యమే. వ్యంగ్య ప్రధానమే. రసాస్పదమే. శబ్దార్థాలంకార శోభితమే. చదివిన ప్రతిసారి ఆనంద పారవశ్యంలో మునిగి తేలవలసినదే. ఒకసారి గదుడనేవాడు ద్వారక నుంచి ఇంద్రప్రస్థ పురానికి వస్తాడు. కుశల సమాచార సేకరణ పిదప అతడు అర్జునుని విడిగా కలుసుకొని సుభద్రను గురించి చెపుతాడు. ఆ ఘట్టంలోని పద్యం.
కనస్సుభద్రకు న్సమంబుగాగనే మృగీవిలో
కనన్ నిజంబుగాగ నే జగంబునందు జూచికా
కనన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః
కనన్మనోజ్ఞ రేఖలెన్నగా దరంబె గ్రక్కునన్
ఈ పద్యానికి ఎన్నుకున్న పదాలు, చెప్పిన పద్ధతి, నడిపించిన తీరు అద్భుతం. ఈ పద్యం పంచచామరము. మరో పద్యంలో గంగానదిని వర్ణించిన తీరు శభాషనిపిస్తుంది.
సునాసీరసూనుండు సూచన్నిమజ్జ
జ్జనౌఘోత్పతత్పంక శంకాకరాత్మో
ర్మి నిర్మగ్న నీరేజ రేఖోన్న మద్భృం
గ నేత్రోత్సవశ్రీని గంగా భవానిన్
ఈ పద్యం భుజంగప్రయాతము.
గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయని, పాపం నల్లగా వుంటుందని ప్రసిద్ధి. ఆ నదిలోని తామర పూవులలో తిరుగాడుతున్న తుమ్మెదలు తరంగాలు తగిలి పైకి లేచిపోతూ వుంటే, అవి స్నానం చేస్తున్న వారి పాపాలా అన్నట్లున్నై. అటువంటి ప్రకృతి సౌందర్యంతో కనువిందు చేస్తున్న గంగానదిని అర్జునుడు చూశాడు.
ఇట్లా ఎన్ని పద్యాలనైనా ఉటంకించవచ్చు. పాతాళలోకం నుంచి వచ్చిన ఉలూచి అర్జునుని చూసి ఆయనను గుర్తుపట్టిన సందర్భం లోనిది ఈ పద్యం.
హిమరసైక సైకతము నందు విహరించు
కైరవేషు వేషు ఘన నిభాంగు
నెనరు దవుల దవులనే చూచి క్రీడిగా
నెఱిగి ర రగేంద వదన.
హిమరసం అంటే మంచు. మంచుతో తడిసి వున్న ఇసుకపై పచార్లు చేస్తున్న మన్మథుని వంటి ఆకృతి కలిగిన, మేఘమువలె నల్లగా వున్న వ్యక్తిని చూడగానే ప్రేమ పుట్టిందంటే, అంతకుముందే ఆమె మనసు అర్జునార్పితమై వుంది గనుక ఇప్పుడు తననాకర్షించినవాడు అర్జునుడే అయివుంటాడని భావించింది. ఇది ఒక రకమయిన తర్కం. ఈ పద్యంలో రెండు హల్లులు పక్కపక్కనే రావడం వల్ల దీనిని ఛేకానుప్రాసము అంటారు.
మరొక పద్యము..
గుట్టసియాడ గబ్బిచనుగుట్టలపై బులకాంకురావళుల్
తెట్టువగట్ట గోరికలు దేటలు వెట్టగ వేడుకల్మది
న్దొట్టి కొనంగ నచ్చెరువు తొంగలి ఱెప్పల వీగనొత్తగా
బెట్టిన దండదీయక విభీతమృగేక్షణ సూచెనాతనిన్
ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణను యథాతథంగా వర్ణించడం వల్ల ఇది స్వభావోక్తి అలంకారం.
మరొక పద్యం..
పై పయి కౌతుకంబు దయివారి యిటుండగ నంత మజ్జనం
బైపువుజప్పరమ్మున నొయారముగా గయిసేసి దానలీ
లా పరతంత్రుడై కలకలన్నగుచుండెడి సవ్యసాచి నిం
ద్రోవల రోచి జూచి తలయూచి యులూచి రసోచితంబుగన్
ఇందున్నది వృత్త్యనుప్రాసాలంకారము. ఈ రకంగా ఏ పద్యం తీసుకున్నా ఏదోఒక అలంకారం వుండే తీరుతుంది.
చివరగా ఒక పద్యం.
కానుకగాగనిత్తు బిగికౌగిలి పల్కవె కీరవాణి నీ
దౌ నుడితేనె నా చెవుల నాన, గృపారసధార నాన న
నాన్ననమెత్తిచూడు నలినానన గోలతనాన నేలలో
నాన చలంబు నీకు మరునాన సుమీ విడు నాన యింకిటన్.
అర్జునుడు పాండ్యరాజు కుమార్తె చిత్రాంగదను పెళ్లి చేసుకుంటాడు. ఆరోజు రాత్రే శోభనం ఏర్పాట్లు అన్నీ జరుగుతై. పిల్లను గదిలోకి నెట్టి తోడువచ్చిన చెలికత్తెలు తలుపువేసి వెళ్లిపోతారు. మంచం మీద ఆసీనుడై వున్న అర్జునుడు ఆమె అందాన్ని చూసి మోహము ఆపుకోలేక ఆమె కొంగుపట్టి లాగుతాడు. మంచం మీద అతని పక్కనే కూర్చుంటుంది బెల్లంకొట్టిన రాయిలా. ఉలుకూ పలుకూ లేదు. ఒక్క మాటైనా మాట్లాడు.. బిగికౌగిలి కానుకగా ఇస్తానంటాడు. కీరవాణీ! అని సంబోధిస్తాడు. చిలుక పలుకులదానా అని అభిప్రాయం.
‘నీ పలుకులు నా చెవి ఆనేట్లు చెయ్. అవి నాకు తియ్యగా వుంటయ్. నా చెవులకు విందు చేస్తయ్. నీ దయా రసంలో నన్ను నానేట్లు చెయ్. తలపైకెత్తి చూడు నలినానన’ అంటాడు. పద్మము వంటి గుండ్రని శోభాయమానమైన ముఖం కలదని భావం. ‘ఎందుకింత చిలిపితనం? ఎందుకింత పట్టుదల? నామీద కోపమా? సిగ్గును ఒదిలిపెట్టు? మన్మథుని మీద ఒట్టుపెడుతున్నా’నన్నాడు. ఈ పద్యంలో కవి ఎనిమిది ‘నాన’లు ఎనిమిది అర్థాలలో వాడాడు. అదీ వెంకటకవి చమత్కారం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈతని కవిత్వం సుధారసంతో పెంచిన మామిడి చెట్టుకు కాసిన పండ్లరసంలో తేనె కలిపి తాగుతున్నట్లుంటుంది. మొదటగా ‘కీరవాణీ! నీ పలుకులనే తెనెను నా చెవులకు ఆనేట్లు, అనగా సోకేట్లు’ చెయ్యమన్నాడు. తర్వాత దయారసంలో నానేట్లు చేయమన్నాడు. తదుపరి నన్ను అననమెత్తి చూడమన్నాడు. పిమ్మట నలినానన అని సంబోధించాడు. గోలతనాన - అమాయకంగా - ఎందుకు నీకు నాపై కోపం - లోనాన చలంబు నీకు అన్నాడు. మన్మథునిపై నాన - ఒట్టు అన్నాడు. విడునాన యింకిటన్. ఇక ఇక్కడ సిగ్గుపడరాదు. దాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇది శబ్ద చమత్కారం. అసలీ పుస్తకం నిండా అలంకారాలే. ఈ గ్రంథ కృతిపతి రఘునాథరాయలు గొప్ప విద్వాంసుడు. మహాభారత సంగ్రహం, రామాయణ కథాసారం, సంగీతసుధ, సాహిత్యసుధ, భారతసుధ, వాల్మీకి చరిత్ర, రఘునాథ రామాయణం, శృంగార సావిత్రి, నల చరిత్ర మొదలైన గ్రంథాలు ఎన్నో రచించాడు. అటువంటి రాజు ఈ కవిని ఎంతగానో ప్రశంసించాడు. అదీ ఒక పద్యంలో..
‘ప్రతి పద్యమునందు చమ
త్కృతి గలుగం జెప్పనేర్తు వెల్లడ బెళుకే
కృతివింటి మపారముగా
క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదుసుమీ’ అన్నాడు.
ఇంతటి మనోహర కవిత్వాన్ని అందించిన వేంకట కవికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములర్పిస్తున్నాను.

- ప్రయాగ కృష్ణమూర్తి,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 8179063842

- ప్రయాగ కృష్ణమూర్తి