భక్తి కథలు

బసవ పురాణం -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు కొందరు దొంగలు అంతఃపురంలోని ధనాన్ని అపహరించాలని యత్నించారు. లింగధారి కానివారికిలోపలికి ప్రవేశం లేదని తెలిసి వారంతా వంకాయలను లింగకాయలవలె కట్టుకొని లోపలికి వచ్చారు. బసవన్న ఆదరంతో వారిని మిగిలిన జంగములతోపాటు కూర్చోబెట్టి ‘శివపూజ కానీయండి’ అని ప్రార్థించాడు. దొంగలకు భయం వేసింది. బసవన్న చిరునవ్వు నవ్వాడు. గత్యంతరం లేక దండనకు భయపడి దొంగలు వంకాయలు విప్పి చేతబట్టుకొని అర్చన ప్రారంభించి చూసేసరికి చేతులలో వంకాయలకు బదులు లింగాలున్నాయి. భక్తులు నివ్వెరపోయారు. బసవన్న కన్నులతో నవ్వాడు
నిజమే! భక్తులు స్మరిస్తే పరమేశ్వరుడు ఎందైనా ప్రత్యక్షమవుతాడు. బల్లేశు మల్లయ్య అనే శివభక్తుడు వ్యాపారార్థం పొరుగూరికి పోయాడు. అక్కడ శివాలయము లేదు.
అందువల్ల ధాన్యం కొలిచే కుంచాన్ని లింగంగా భావించి ఉంచి లభ్యమైన కొండగోగులతో పూజ చేశాడు. అక్కడివారు మల్లయ్యను చూచి నవ్వి ‘కుంచం లింగమట! ఏమి వెర్రి! ధాన్యం కొలవాలి, తీసుకొని రండిరా!’ అనేసరికి మల్లయ్య కోపగించి ‘మూర్ఖుల్లారా! నేను అర్చించినప్పుడే కుంచం లింగమైపోయిందిరా! పోయి చూడండి’ అన్నాడు. వాళ్ళు వెళ్లి చూచేసరికి కుంచం సాక్షాత్తు లింగమూర్తి అయింది. దాని చుట్టూ, గుడి స్వర్ణశిఖరం, వృషభేంద్రునితో ఆలయం వెలిసి వుంది!
కాటకోటడు అనే మరొక ముగ్ధ్భక్తుడున్నాడు. ఆయన గొల్లవాడు. ఒకనాడు మేక పెంటికను లింగంగా భావించి దానిని పాలతో అభిషేకం చేశాడు. అది విని ‘పాలన్నీ నేలపాలు చేశావు కదరా’ అని తండ్రి ఆ పెంటికను కాలదనే్నసరికి కాటకోటడు ఆ శివాపచారాన్ని సహింపలేక చేతిలో గండ్రగొడ్డలితో ఒకే దెబ్బన తండ్రి తలను నరికాడు. ఆ దెబ్బకు కైలాసంలోని సింహద్వారాలు దభీ దభీమని ఊగి ఊడి పడిపోయాయి. అలాగే బావూరి బ్రహ్మయ్య అనే భక్తుని భావనతో జొన్నలు లింగాలైనాయి. అందువల్ల భక్తులకు అసాధ్యమేముంది?
ఇలా వుండగా ఒకనాడొక భక్తుడు బసవన్న వద్దకు వచ్చి ‘‘నాకు ముత్యాల ముగ్గు తీర్చి శివార్చన చేసే నియమం వుంది. ముగ్గు తక్కువైంది. వెంటనే పది పుట్ల ముత్యాలు ఇప్పించు’’ అని అడిగాడు. బసవన్న ఒక జొన్నల రాశివైపు చూచాడు. ఆయన అమృత వీక్షణంవల్ల జొన్నలు మొత్తం ముత్యాలైనాయి. ‘పది పుట్లేమిటి? ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పోండి’ అని భక్తుణ్ణి అర్థించాడు బసవన్న!
అయితే ఇందులో ఆశ్చర్యమేమి లేదు. భక్త పరాధీనుడు కాబట్టే భక్తులు తలచినవెల్లా నెరవేరుతాయి. లోగడ మొరటద వంశయ్య అనే శరణుడు ఒక భక్తుని కోరికపై శివపూజ కోసం గొడ్డుటావును పితికి పాలు తెప్పించాడు. ఎండు కట్టెను కోసి బిల్వాలు తెప్పించాడు!
బసవన్న వద్ద ముత్యాలు తీసుకొన్న భక్తుడు ‘బాపురే! బసవన్నా! నీ భక్తిని పరీక్షిద్దామని వచ్చానయ్య!’ అని చూస్తుండగానే తన జంగమ వేషాన్ని వదలి వేశాడు. బసవన్న ఆశ్చర్య చకితుడై చూచేసరికి అక్కడ పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు.
‘బసవా! మూడవ కనే్నదీ?’ అని ప్రశ్నించాడు శివుడు. బసవన్న నవ్వి అద్దం పట్టి అందులో శివునికి మూడవ కన్నును చూపించాడు. ‘నీ మాయ నే వెరుగుదును స్వామీ’ అన్నాడు బసవడు. అది విని శివుడు లజ్జించి అంతర్థానుడైనాడు. ఇలా శివుడోడి బసవడుగెలిచాడు.
గొల్లెత కథ
ఒకనాడు బిజ్జలుడు కొలువుదీరియుండగా బసవన్న ఉన్నట్టుండి ‘పడవద్దు- పడవద్దు’ అని రెండు చేతులూ పైకెత్తాడు. అది చూచి రాజు నవ్వి ‘ఏమి బసవన్నా! గాలిలో చేతులెత్తి పడవద్దని అంటున్నావు. భక్తిరసం తలకెక్కి శివమెత్తిందా ఏమిటి? అన్నాడు. అప్పుడు బసవన్న ‘ప్రభూ నిండు సభలో స్వగుణ సంకీర్తనం చాలా తప్పు. అయినా మీరు అడిగారు కాబట్టి గత్యంతరం లేక చెపుతున్నాను. త్రిపురారి గుడి తూర్పు దిక్కున కపిలేశ్వరంలో ఒక తపస్వి శివునికి ఆరుపుట్ల పాలతో క్షీరాభిషేకం చేస్తాడు. నిత్యమూ అవి కాలువ గట్టి నేడు వీధిలోకి వచ్చి ఏనుగులు తొక్కడంతో బురదగా అయింది. ఆ వీధిలో చల్లనమ్ముతూ పోతున్న ఒక గొల్లెత బురదలో కాలుజారి పడబోతూ ‘బసవా! బసవా! అని నన్ను స్మరించింది. తక్షణమే నేను చేయెత్తి ‘పడవద్దు పడవద్దు’ అని సాయం పట్టి కుండ పట్టుకున్నాను’’ అన్నాడు.
సభ ఈ విషయాలు నమ్మలేదు. బిజ్జలుడు తక్షణమే భటులను పంపి గొల్లెతను పిలిపించి నిజానిజాలు విచారించాడు. గొల్లెత నిజమేనని చెప్పి తనకంటిన బురదను చూపించింది. సభ మొత్తమూ నివ్వెరపోయింది.
అప్పుడా గొల్లెత ‘ప్రభూ! పూర్వం తిరుచిట్టంచిలుడు అనే భక్తుడు శివపూజకై పూలు తెస్తూ నదీ తీరంలో కాలు జారిపడిపోతూ ‘ప్రభూ’ అని కేకబెట్టగా శివుడు స్వయంగా వచ్చి భక్తుణ్ణి పట్టుకున్నాడు. నేనూ అదేవిధంగా బసవణ్ణి స్మరిస్తే బసవలింగయ్యగారు నాకు నేడు సహాయం చేశాడు’ అని చెప్పింది.
-ఇంకా ఉంది

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్