మెయన్ ఫీచర్

మోదీ రాజకీయ మంత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ దేశాన్ని ఒక చాయ్‌వాలా ఏలుతాడని జనం సహా ‘కమలదళాలూ’ ఏనాడూ ఊహించి ఉండరు. మోదీ ఛాతీనుద్దేశించి- ‘దేశానికి కాబోయే ప్రధాని’ రాహుల్‌బాబు ఎన్నిసార్లు వ్యంగ్యాస్త్రాలు సంధించినా, దాని వెడల్పు ఏమిటన్నది ఈపాటికి ప్రపంచమే చూసింది. తెలుగు మీడియా మోతుబరి ఒకరు ప్రధాని మోదీని ఆ మధ్య ‘అనకొండ’తో పోల్చారు. అమాంతం మింగేసే అనకొండ అనే సర్పంతో, మోదీ రాజకీయ వ్యూహాన్ని పోల్చుతూ ఆయన దేశంలోని రాజకీయనేతలందరినీ లొంగదీసుకుంటున్నారంటూ టన్నులకొద్దీ ఆవేదన కురిపించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభువులిద్దరికీ, అనన్య సామాన్యమైన సేవలందిస్తున్న సదరు మీడియా రాజగురువులుంగారు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు వంటి ‘ప్ర జాస్వామ్య హత్యాకాండ’ గురించి పల్లెత్తుమాటనరు.
తాజాగా బిహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే మోదీ దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా? అన్న అనుమానం రాకతప్పదు. తెలుగు మీ డియా మోతుబరి చెప్పినట్లు బిహార్‌లో చూసింది అనకొండను కాదు, అవినీతి అనకొండను ఢీకొట్టి, సీఎం పదవికే రాజీనామా చేసి బయటకు వచ్చిన నితీశ్‌కుమార్ అనే నిజాయితీపరుడికి ‘గొడుగుపట్టిన సేవకుడి’నే దేశం దర్శించింది. మోదీ నిజంగా తలచుకుంటే బిహార్‌లో గవర్నర్ చేత అప్పటికప్పుడే ప్రభుత్వాన్ని రద్దు చేయించి, బిజెపినే ప్రభుత్వం ఏర్పాటుచేయమని ఆహ్వానించేలా చేయవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఆవిధంగానే బిజెపి అడ్డదారి తొక్కింది కాబట్టి!
నిజంగా అదే చేస్తే మోదీ ఛాతీ రెండు అంగుళాలు తగ్గిపోయేది. నితీశ్‌తో చేతులు కలిపి బిజెపి కూడా ఆ సర్కారులో కొలువుతీరింది. లాలూ పుత్ర వాత్సల్యమే బిహార్‌లో ఆయన పుట్టిముంచిందన్నది నిర్వివాదం. ఒక్క లాలూనే కాదు. ప్రస్తుతం దేశంలో ఉన్న పెద్ద తలలంతా పుత్ర వాత్సల్యంతోనే నగుబాటుపాలవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘సన్’స్ట్రోక్స్‌తో అధికార పార్టీలు అప్రతిష్ఠపాలవుతున్నాయి. ఈ విషయంలో అసలు పెళ్లేకాని రాహుల్‌బాబు చాలా అదృష్టవంతుడు! ‘దేశం అంతా బిజెపి ముఖ్యమంత్రులే ఉండాలి. మేం ఏ రాష్ట్రాన్నీ వదలం. రాజకీయమంటే అధికారమేన’ని బిజెపి జాతీయ పెద్ద రాం మాధవ్ కుండబద్దలు కొట్టిన తర్వాత కూడా ఇంకా నైతిక విలువల గురించి, అధికారంలో లేకపోయినా సేవ చేయవచ్చని, అధికారం కోసమే రాజకీయపార్టీలు పనిచేయకూడదన్న గిరీశం డైలాగులు ఎవరైనా వల్లెవేస్తే వారిని అనుమానంగా చూడాల్సిందే. రాం మాధవ్ చెప్పింది అక్షరసత్యం. కశ్మీర్ నుంచి ఒక్క ఓటరు కూడా లేని ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చిన మాధవ్‌జీ బహుశా అది స్వీయానుభవంతో చెప్పి ఉండాలి.
మంత్రాలకు చింతకాయలు రాలవంటారు. కానీ ఇప్పుడు దేశంలో మోదీ మంత్రానికి విపక్షాలు రాలుతున్నాయి. ఒక్కో రాష్ట్రం ‘కమలం’ ఖాతాలో పడుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ‘క మలం’ వికసిస్తోంది. బిజెపి ఏ పార్టీతోనయితే భాగస్వామిగా పనిచేసిందో, ఆ తర్వాత అదే రాష్ట్రంలో సొంతంగా విరబూసిన దాఖలాలు బోలెడు. అం దుకే బిజెపితో పొత్తు ఉన్న పార్టీలకు బెరుకు. అవసరార్థం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా, చాపకింద నీరులా విస్తరించి, ఏకు మేకయిపోవడం దాని సహజ స్వభావం. అలెగ్జాండర్ అన్ని దేశాలను జయించినట్లు మోదీ కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలనూ జయించేందుకు చేస్తున్న రాజకీయ అశ్వమేధయాగం చూడముచ్చటగా ఉంది. రాం మాధవ్ చెప్పినట్లు బిజెపి ఫక్తు రాజకీయమే చేస్తోంది. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీల ముందున్న ఏకైక మార్గం మోదీకి లొంగిపోవడం లేదా తమపై ఎలాంటి అవినీతి మకిలి లేకుండా చూసుకోవడం. అవినీతి మకిలి ఉన్న పార్టీలపై సీబీఐ, ఈడీ ప్రయోగించడం పరిపాటి. ఈ విషయంలో కాంగ్రెస్ గుండెలవిసేలా చేస్తున్న ఆక్రందనలు ‘వృద్ధనారి పతివ్రత..’ అన్నట్లుంది. ఇలాంటి పెంపుడు సంస్థలను దారికిరాని ప్రత్యర్థులపై ఉసిగొల్పి, పాదాక్రాంతులను చేసుకున్న విద్యలో కాంగ్రెస్ డిగ్రీ చేస్తే, బిజెపి పీజీ చేసింది. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. కాకపోతే విధానాలే వేరు. ఇద్దరి రాజ్యకాంక్షకు దర్యాప్తు సంస్థలు శ్రమదానం చేయడం ఇదే మొదలు కాదు, ఆఖరూ కాదు.
మోదీ మాంత్రికుడి మంత్రదండానికి నితీశ్‌కుమార్ అంతటి రాజకీయ యోగి పడిపోతే, ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కుదిరితే యుద్ధం చేయడం, లేకపోతే శరణువేడటం అనేవి మాత్రమే యుద్ధంలో ఉం టాయి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కనిపిస్తోన్న రాజనీతి ఇదే. తెలుగురాష్ట్రాల్లో ఏమి జరగబోతోంది? మోదీ మంత్రదండం ఇక్కడ పనిచేస్తుందా? కేసీఆర్ చెప్పినట్లు పనిచేయదా? మోదీని ఎదిరించే మొనగాడు ఎవరు? ఏపిలో చంద్రబాబుతో చెలిమి చేస్తూనే జగన్ వైపు ‘కమలనాథులు’ పక్కచూపులు చూడటం వెనుక మతలబేమిటి? జగన్‌ను అరెస్టు చేయాలన్న టిడిపి కోరికను ఇప్పటివరకూ బిజెపి అధినాయకత్వం మన్నించకపోవడానికి కారణమేమిటి? వచ్చే ఎన్నికల్లో బిజెపి టిడిపితో కలసి పోటీచేస్తుందా? లేకపోతే క్విజ్ పోటీలో ఆప్షన్ మాదిరిగా వైసీపీని తెరపైకి తీస్తుందా? తెలంగాణలో ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌తో కలసి పోటీచేసే యాక్షన్‌ప్లాన్ ఏమైనా ఉందా? పెద్దనోట్ల రద్దు తర్వాత ఆపదలో పడిన దేశాన్ని ఒడ్డున పడేసేందుకు వేసిన కమిటీకి సారథ్యం వహించిన ‘మిత్రబాబు’కు మోదీ అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లే దు? మీడియా రాజగురువు చాలా బాధపడి, వాపోయి, ఆవేదనతో కన్నీరుమున్నీరయినట్లు బాబు ఎంత ఒదిగినా, చివరకు మోదీ కాళ్లదగ్గర ఒక చిన్న కాగితం ముక్కను కూడా బాబు స్వయంగా వంగి తీసినా మోదీ ఎందుకు కనికరించడం లేదు? కేసీఆర్, జగన్‌తో మోదీ ఎందుకు భేటీ అవుతున్నారు? తెలుగు రాష్ట్రాల ఏలికలు నాలుగు గోడల మధ్య మాట్లాడుకునేవన్నీ రాజగురువులుంగారి శిలాక్షరాల్లో ఎలా చేరుతున్నాయి? అంటే పాలకులు వారితో పంచుకుంటున్నారా? వాటి వెనుక ఎవరున్నారని ఆలోచిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మోదీ మంత్రం ఎలా పనిచేయబోతుందో తెలుసుకోవడం సులభం.
కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణలో బిజెపి బలపడటం అంత సులభం కాదు. అన్ని రాష్ట్రాలూ ఉత్తరప్రదేశ్‌లు కావు. పైగా బిజెపికి నాయకులున్నా గట్టి నాయకత్వం లేదు. ఏ చెట్టూ లేనిచోట ఆముదం చెట్టే మహావృక్షమన్నట్లు ఉన్న జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలే దిక్కు. టిడిపి,టిఆర్‌ఎస్‌లో ఒక డివిజన్ కమిటీ అధ్యక్షుడు కావడం చాలా కష్టం. అదే బిజెపిలో జాతీయ కమిటీలో కూడా చోటు దక్కుతుంటుంది. పైగా కొత్తగా చేరేవారిలో సాధ్యమైనంత వైరాగ్యం పుట్టించి, వారంతట వారే వెనక్కి వెళ్లేలా చేయడం ఒక్క బిజెపి పాతకాపులకే సాధ్యం. నాగం జనార్దన్‌రెడ్డికి రాజనాథ్ సింగ్ దన్ను లేకపోతే ఈపాటికి రాజకీయ సన్యాసం తీసుకునేవారు. కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగి, రాష్టస్థ్రాయిలో చక్రం తిప్పిన కన్నా, కావూరి, పురంధ్రీశ్వరి వంటి సీనియర్లు ఇప్పుడు జూనియర్ నాయకుల పక్కన కూర్చోవలసిన దుస్థితి.
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఎప్పుడూ స్వయంప్రకాశం కాదు. ‘కామ్రేడ్ల’ మాదిరిగానే ఏదో బలమైన పార్టీ భుజానెక్కి, వారి బలంతో ఎదగడమే తప్ప, ఒంటిచేత్తో అధికారంలోకి వచ్చేంత శక్తి లేదన్నది నిర్వివాదం. అయితే టిడిపి, లేకపోతే వైసీపీ! బలం పెంచుకునే హడావుడికి పెద్దపార్టీలే కంగారుపడేలా చేయటం, పొత్తు చర్చల ముచ్చట్ల సమయంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు లాగించేయడమే బిజెపి అసలు వ్యూహం. జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలపై ఎలాంటి ప్రేమ ఉండదు. అవసరం తప్ప! మోదీ మంత్రం ఇప్పుడు దివ్యంగా పనిచేస్తోంది కాబట్టి చంద్రబాబు ఆయన చేతిని ససేమిరా విడిచిపెట్టరు. అది మోదీకీ తెలుసు. మోదీ-అమిత్‌షా నిర్ణయాలు కఠినంగా, కర్కశంగా ఉంటాయని వారిద్దరి గురించి బిజెపిలోని పెద్ద తలకాయలకు మాత్రమే తెలిసిన నిజాలన్నీ తెలుగుమీడియా మోతుబరులు సెలవిచ్చారంటే, ఆ చెవుల్లో ఏ స్థాయి నేతలు ఏమి ఊదారని చెప్పడానికి పెద్ద మేధావులే కానక్కర్లేదు. గత పక్షం రోజుల నుంచి అంటే ఉప రాష్టప్రతి ఎన్నిక వ్యవహారం నాటి నుంచి తెలుగు మీడియా శోకసంద్రంలో ఉన్నట్లు కనిపిస్తోంది. బాధాతప్తహృదయంతో అవి వెలువరిస్తోన్న అక్షరాలు చూస్తే అసలు ఈ తెలుగురాష్ట్రాలు ఏ విధంగా బతుకుతాయి? అమాయకులైన ఇద్దరు ‘చంద్రుల’ బాగోగులు ఇకపై ఎవరు చూస్తారు? అన్న ఆందోళన కలుగుతోంది. ఉత్తర-దక్షిణాల వివక్షా రాజకీయాలు, నియోజకవర్గాల సంఖ్యతోపాటు తెలుగురాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, దానిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆగ్రహ కథనాలు చూస్తే అవన్నీ ఎవరి కోసం? ఎందుకోసం పుట్టుకొచ్చాయి? ఎవరి ప్రాయోజిత కథనాలని, ప్రత్యర్ధుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తారన్న మోదీ-అమిత్‌షాలకు ఈపాటికి ఉప్పంది ఉండటం సహజమే కదా? అప్పుడు నష్టమెవరికి? పొగడ్తలు ఒక్కోసారి పుట్టిముంచుతాయి.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144