ఫోకస్
ప్రజలకు మేలు జరగాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్కు పేరుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో పార్లమెంట్ది ముఖ్య భూమిక అనే విషయంలో సందేహం లేదు. పార్లమెంట్ మొదలుకుని గ్రామ పంచాయితీల వరకు జరిగే సమావేశాలు ప్రజాస్వామ్య వేదికలుగా ఉండాలి. పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయితీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై చర్చకే అత్యంత ప్రాధాన్యత ఉండాలి. ప్రపంచ దేశాల ముందు మన ప్రజాస్వామ్య విధానం ఆదర్శంగా నిలవగలగాలి. చట్టసభలు, స్థానిక సంస్థల సభ్యులపై గురుతరమైన బాధ్యత ఉందనడంలో అతిశయోక్తి లేదు. మన దేశంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలకే పార్లమెంట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రపంచ దేశాలు కొనియాడేలా సభలు జరగాలి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారపక్షం బాధ్యత ఎక్కువగా ఉంటుందా? విపక్షం బాధ్యత ఎక్కువగా ఉంటుందా? అన్న చర్చ వస్తే అధికార-ప్రధాన పక్షం పరస్పరం విశ్వాసంలోకి తీసుకోవాలని చెప్పుకోకతప్పదు. పార్లమెంట్ సజావుగా జరగకపోవడం వల్ల ముఖ్యమైన సమస్యలపై చట్టాలు రూపొందడం లేదన్న భావన ప్రజల్లో కలుగుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భూసేకరణ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయి. దాంతో ఈ బిల్లు ఆగిపోయింది. భూసేకరణకోసం కొంత కాలం పాటు ఆర్డినెన్స్లను జారీ చేసిన కేంద్రం చివరకు విపక్షం వత్తిడికి తలొగ్గి ఆర్డినెన్స్ గడువు పొడిగించలేదు. ప్రస్తుతం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల ముందు జిఎస్టి బిల్లు ఉంది. ఇది కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన బిల్లు అయినప్పటికీ, ఎన్డిఎ సర్కారు అనేక సవరణలు చేసింది. ఈ సవరణ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తొలుత విపక్ష సభ్యులను ఒప్పించగలిగితే ఈ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు ఇబ్బంది ఉండదు. దేశంలో పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడానికి విపక్షం ప్రవర్తన కారణమన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో పార్లమెంట్ను విపక్షాలు స్తంభింప చేయడం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిదే. విపక్షం చెప్పేది చెబుతుంది.. అధికార పక్షం చేసేది చేస్తుందన్న విధానం పోవాలి. ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన సమయంలో అభివృద్ధి వేగంగా జరగాలని ప్రజలు భావించారు. విపక్షాలను అధికార పక్షం విశ్వాసంలోకి తీసుకుంటే పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయి. దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం నెలకొల్పే బాధ్యత పార్లమెంట్ తీసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న కొన్ని దుర్ఘటనలు పరిశీలిస్తే, మనదేశం చాలా అప్రమ్తంగా ఉందని ప్రపంచానికి వెల్లడించగలగాలి. దేశంలో అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం అసాంఘిక శక్తుల్లో కలగాలి. అవార్డులు వెనక్కు ఇస్తున్న అంశం, అసహనం అంశంపై విస్తృతంగా చర్చ జరిగి సత్ఫలితాలు రాబట్టాలి. పార్లమెంట్లో చర్చలు ప్రజలకు మేలు జరిగేలా ఉండాలి.