పర్యాటకం

త్రిగుణాత్మకుడు.. అన్నవరం సత్యదేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రారంభంలో బ్రహ్మస్వరూపము, మధ్య భాగంలో మహేశ్వరస్వరూపము చివరకు అంటే పైన విష్ణురూపము ఒక స్తంభంలో ఉన్నవన్న ట్టుగా ఇక్కడ వీర వేంకట సత్యనారాయణ స్వామి త్రిగుణాత్మక రూపంలో రత్నాకరుని కోరిక తీర్చడానికిగాను అన్నవరం లోని అంకుడు చెట్టు మొదట్లోని పుట్టలో వెలిశాడు. ఇలా స్వయంభూగా, అర్చామూర్తిగా రావడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
స్థలపురాణం:
మేరు పర్వతానికి ఇద్దరు కుమారులు. వారే భద్రుడు, రత్నాకరుడు. భద్రుడు మహావిష్ణువును మెప్పించి భద్రాది రామునికి కొలువైన భద్రాచలంగా మారినప్పటి నుంచి రత్నాకరునిలోను తాను కూడా మహావిష్ణువుపాదం మోయాలన్న బుద్ధి పుట్టింది. అది రామావతారసమయం. రాముని దగ్గరకు వెళ్లి ‘అయ్యా! శ్రీరామచంద్రా నీవు మా అన్న భద్రునికి కోరిక తీర్చడానికి అనుకూలంగా ఉన్నావని తెలుసుకొన్నాను. మరి నాకోరిక తీరే మార్గం నాకు చూపించవా? నాకోరికలను తీర్చే భారం కూడా నీదే సుమా. ఇహం పరం బెరుగ నేను. అన్నింటికి కారణాకారుడవైన నీవే నా కోరిక తీరే తరుణోపాయం చెప్పాలి’అని వేయివిధాలుగా ప్రార్థించాడు.
పరంధాముడైన రాముడు చిరునవ్వుతో ‘నాయనా రత్నాకరా నీకోరిక బాగుంది. కాని నేను ఈ త్రేతాయుగంలో కేవలం దశరథ పుత్రుడిని మాత్రమే.నేనిప్పుడు నీకోరికను తీర్చలేను.’ అన్నాడు. దానికి రత్నాకరుడు ఎంతో నొచ్చుకొని స్వామి మీకెప్పుడు నాకోరిక తీర్చాలని నాపై అనుగ్రహం చూపాలని అనిపిస్తుందో అంతదాకా నేను వేచి ఉంటాను. మీరు సంకల్పించినపుడుమాత్రం ఈ అల్పుని కోరికను కాదనకండి. మీరే నాకు దిక్కు. సర్వావస్థల యందు నేను మీకు శరణువేడే వాడిని. మీరు నాకోరిక తీర్చేదాకా నేను మిమ్మేస్మరిస్తూ ఉండే బుద్ధిని నాకు ప్రసాదించండి’ అని వేడుకున్నాడట. దాంతో రాముడు ‘తథాస్తు! ఆ పరమాత్మ ఏది ఏపుడు ఎందుకు సంకల్పిస్తాడో మానవ మాత్రులమైన మనం తెలుసుకోవడం కష్టం. కనుక నీకోరిక తీరాలని నీవు యథాశక్తి దైవాన్ని ప్రార్థించు ’ అన్నాడట. అలా చెప్పడమే మహద్భాగ్యం అనుకొన్న రత్నాకరుడు మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు.అట్లా తపస్సు చేసుకొంటున్న రత్నాకరుని దగ్గరకు మహావిష్ణు వచ్చి వచ్చి ‘నాయనా! నీకోరిక తీరు కాలం వచ్చింది. నేను ఈ అంకుడుచెట్టు మొదట్లో ఉన్న ఈ పుట్టలో వెలుస్తాను. ఇక్కడే నాకు ఆలయం నిర్మించమని ఇక్కడి వారినిప్రేరేపిస్తాను. ఇక నీవు కోరుకున్నట్లుగానే నీవు తపస్సు ఆచరించిన ఈ స్థలంలోనే సత్యదేవునిగా నేనుకొలువు అవుతాను ’ అని చెప్పాడట. కొంతకాలానికి స్వామి చెప్పినట్లుగానే ఓ పుట్టలో స్వయంభూగా వెలిశాడు. ఆ సజ్జనులకు నెలవైన ఆ క్షేత్రంలోనే ఈరంకి సూర్య ప్రకాశం అన్న పేరుగల సజ్జనుడు ప్రతిరోజు అన్నదాన సేవ చేస్తుండేవాడు. కిర్లంపూడి సంస్థానాధీశుడైన రాజా ఇనుగంటి రామనారాయణం బహద్దూర్ తన ఏలుబడిలో అన్నవరంలో ప్రజలందరికీ ఏ కష్టాలు రాకుండా చూడాలని నిత్యం ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిస్తుండేవాడు.
ఒకనాడు మహావిష్ణువు సూర్యప్రకాశం అనే నిత్యాన్నదాన వేత్త అయిన సూర్య ప్రకాశానికి కలలో కనబడ్డాడు. ‘నాయనా! నీవు చేసే నిత్యాన్నదాన సేవకు నేను సంతృప్తి పడ్డాను. అందుకే నీవు నీతో పాటు ఉన్నవారు నన్ను సేవించుకోవడానికి వీలుగా నేను అంకుడు చెట్టు మొదట్లో ఆర్చామూర్తిగా ఉన్నాను. నన్ను వెలికి తీసి నిత్యాధూపదీపారాధనలు చేయండి అని చెప్పాడు. దిగ్గున లేచిన సూర్య ప్రకాశానికి తాను స్వయంగా భగవంతుడిని చూచానన్న సంతోషం ఇబ్బడి ముబ్బడి అయింది. శరీరమంతా రోమాచితం అయింది. కన్నుల్లో నీరు ఉబికి వస్తున్నాయి. ఇంత మంచి శుభవార్తను వెంటనే రాజుగారి చెవిలో వేయాలని సంస్థానాధీశుని దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా పులకాంకిత శరీరంతో ఆశ్రువులు కారుతుండగా రాజాఇనుగంటి వేంకట రామనారాయణం తన వద్ద వున్న మిత్రగణంతో తాను స్వయంగా స్వప్నంలో భగవంతుడిని చూచానని, ఆ దైవం అంకుడుచెట్టు మొదట్లో ఉన్నానని తన్ను వెలికి తీసి పూజించమని చెప్పినట్లుగా చెబుతుండడం చూచి మరింత సంతోషంతో తనకు వచ్చిన కలను కూడా సూర్యప్రకాశం వారికి వివరించాడు.
ఆహా ఆ శ్రీమన్నారాయణుని లీల తెలుసుకొనరానిది. త్రిగుణాతీతుడైన స్వామి మనలను ఇలా కరుణించాడు కనుక వెంటనే మనం ఆ పుట్ట దగ్గరకు వెళ్దాం అని అనుకొని ఊరి వారంతా కలసి వెళ్లారు. అక్కడ ఆ చెట్టు మొదట్లో ఉన్న పుట్టను తవ్వారు. దేదీప్యమానంగా వెలుగుతున్న సత్యదేవుని విగ్రహం వారికి కనబడింది. జయఘోషతో స్వామిని వారంతా కీర్తించారు. అందరూ కలసి స్వామిని బయటకు తీసి అభిషేకాదులు నిర్వర్తించారు. ఆ తరువాత చిన్న తాటాకు పందిరి వేసి ఆ స్వామి వారికి నీడ కల్పించారు. అందరూ స్వామిని వీర వేంకట సత్యనారాయణుడుగా అభివర్ణించారు. కొన్నాళ్ల తరువాత ఆ సంస్థానాధీశుడు మహాపండితులను రావించాడు. ఆగమశాస్తవ్రేత్తలు పిలిపించాడు. వారందరి సలహాను తీసుకొని అన్నవరం లో రత్నాచలం మీద సత్యదేవుని కోవెలను రథాకృతిలో ఉండేట్లుగా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీర వేంకట సత్యదేవుని కొలువు తీరడానికి వాస్తు ప్రకారం ఆలయ నిర్మాణంతో ప్రారంభించారు. ఈ దేవాలయం రెండు అంతస్థులతో ఉంటుంది. మొదటి అంతస్థు యంత్రాలయంగాను, రెండవ అంతస్థులో స్వామి దివ్యమంగళ స్వరూపం కనబడుతుంది. మధ్య ప్రదేశం పానవట్టంగా కనబడడం ఇక్కడి విశేషం. ఈ యంత్రనిర్మాణంలో వృత్తాకారంలో ఉన్న శిలాయంత్రంలో మొదటి భాగం బ్రహ్మస్వరూపంగాను, రెండవ భాగం లింగాకార స్తంభం శివస్వరూపంగాను, ఇక ఊర్థ్వమండలిలో కనిపించే విగ్రహం నారాయణ స్వరూపంగా దర్శన మివ్వడం అంటే నిస్సంగుడు, నిర్వికారుడు, నిరామయడు, నిరాకారుడు , గుణాతీతుడు అయిన దైవం ఇక్కడ త్రిగుణాత్మకుడుగా దర్శనం ఇస్తున్నాడని దీని అంతరార్థంగా పండితులు చెప్తారు. తనను కొలిచిన వారిని ఇంద్రియాలను జయించే శక్తినిస్తాడని వారిని సాత్విక గుణ సంపన్నులుగా తీర్చి దిద్దుతాడని ఇక్కడి నివాసితులు చెప్తారు. ఈ అన్నవరానికి దగ్గరలో పంపానది ప్రవహిస్తూ ఉంటుంది.ఈ సత్యదేవుని గుడిలో అమ్మవారు అనంతలక్ష్మీ నామధేయంతో అన్నార్తులను, దీనులను, ఆపన్నులను సంరక్షిస్తూ ఉంది.
ఇక్కడకు వచ్చే భక్తజనంలో సత్యధర్మాచరణ చేసేవారికి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి అంత ఎల్లవేళలా ఉంటుంది. సత్యధారణ చేసేవారంతా సత్యదేవుని మారురూపాలని సత్యదేవుని దగ్గర అసత్యులు, అధర్మాచరణులైన వారికి నిలువ నీడ ఉండదని అటువంటి వారిని నిముషాల్లోనే స్వామి శిక్షిస్తాడని సత్యదేవుని భక్తుల నమ్మకం. సత్యదేవుని దర్శించడానికి రైల్వే వారు కూడా రత్నాచల్ అనే రైలుసదుపాయాన్ని కల్పించారు. ఈ రత్నాచల్‌లో ఎక్కిన వారు అన్నవరంలోనే దిగే సౌకర్యం ఉంది. ఇక అక్కడ నుంచి తనపై పాదం మోపాలని తనపైనే స్థిర నివాసమేర్పరుచుకోవాలని కోరిన రత్నాచలుడు రత్నగిరి గా మారిన కొండపైకి చేరుకోవాలి. ఈ కొండపైన కోరి కొలువున్న వీర వేంకట సత్యదేవుని దర్శనం చేస్తే ఇహపరాల్లో సుఖసంపదలకు కొదువ ఉండదనే కీర్తిని పొందాడీ వీరవేంకట సత్యనారాయణ స్వామి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని శంఖవరం మండల పరిధిలోని అన్నవరం రాజమండ్రికి సుమారు 70 కి.మీ దూరంలోను, కాకినాడకు సుమారు 45 కి.మీల దూరంలోను నెలకొని ఉంది. శివకేశవుల అభిన్నత్వానికి మారుపేరుగా నెలకొన్న ఈ వీర వేంకట సత్యనారాయణ స్వామి క్షేత్రంలో ప్రతి విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అమ్మవారికి, స్వామికి నిర్వహిస్తారు. శ్రావణ శుద్ద విదియ నాడు స్వామి వారి జయంతిని, వైశాఖ శుద్ధ దశమినాడు కల్యాణోత్సవాలను జరుపుతారు. తెప్పోత్సవాలు, జ్వాలా తోరణాలు, కుంకుమార్చనలు, వివిధ పుష్పార్చనలు తులసీ అర్చనలు విశేషవేళలలో కనువిందుగా జరుగుతాయి. ఈ స్వామిని దర్శించడానికి వారి వారి పాపరాశులను దగ్ధం చేసుకోవడానికి ఎక్కడెక్కడనుంచో భక్తులు నిత్యమూ తండోపతండాలుగా ఈ క్షేత్రానికి వస్తుంటారు.

- శ్యామసుందరి శ్రీనివాసులు