పర్యాటకం

ఏకాదశ రుద్రుల కొలువే ప్రభల తీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనసీమలో తరతరాలనుండి సంక్రాంతికి వెలుగుల్లో వైభవోపేతంగా ప్రభలీనుతున్న ఉత్సవాలు జగ్గన్నతోట ప్రభల తీర్థాలు.
మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో సంక్రాంతిపండుగమూడవ రోజున జరుపుకునే కనుమపండుగదినాన కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైనది, చారిత్రాత్మకమైనదీ ప్రభల తీర్థం.
జగ్గన్నతోటలో ఏ విధమైన గుడిగానీ, గోపురం గానీ లేవు. అక్కడంతా ఉన్నది కొబ్బరి తోటే. ఏకాదశ రుద్రులు కొలువుతీరడం వల్ల జగ్గన్నతోట ఎంతోప్రాముఖ్యతను సంతరించుకున్నది.
ఏకాదశరుద్రులు ఒకచోట కొలువుతీరేది ఈ ఒక్క కోనసీమలోని జగ్గన్నతోటలోనే. లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్నతోటలో సమావేశము అవుతారని పెద్దలంటారు. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దములో సంక్రాంతిలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్థము నిర్వహించబడుతున్నదని ఇక్కడి పెద్దలు చెబుతారు. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజావత్సవాయి జగన్నాథ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థమునకు విచ్చేశారు. ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషిసల్పారని ఆరోజు మహారాజు చేసిన జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరుగు ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా పిలవబడుతున్నది ఇక్కడి వారి విశ్వాసం.
ప్రభల తీర్ణం రోజున ఏకాదశ రుద్ర గ్రామములలో కొలువున్న స్వామివార్లు గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వరస్వామి, గంగలకుర్రు- చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం- వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి- మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ- ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక- కాశీ విశే్వశ్వరస్వామి, నేదునూరు- చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల- రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి- మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి- చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు- అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం ఇక్కడి ఆచారం.
ప్రభల తీర్థమునకు ఆతిధ్యమిచ్చు మొసలపల్లి- మధుమానంత భోగేశ్వరస్వామివారు అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్నతోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలుకుతారు. అంతేకాక తిరిగి వెళ్ళేవరకూ ఇక్కడే ఉండడమూ సంప్రదాయమే.
జగ్గన్నతోట ప్రభలతీర్థమునకు అధ్యక్షత వహించు వ్యాఘ్రేశ్వరం- వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభ తీర్థం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థములో ప్రత్యేక విశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం- వీరేశ్వరస్వామి, గంగలకుర్రు- చెన్నమల్లేశ్వరస్వామివార్ల ప్రభా వాహనములను కౌశికలో నుండి అవతలి ఒడ్డుక చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు.
ముఖ్యంగా జగ్గన్నతోట ప్రభల తీర్థములో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్నిప్రభలకన్నా ఆఖరుగా వచ్చు గంగలకుర్రు అగ్రహారం- వీరేశ్వరస్వామి ప్రభా వాహనం తీర్థంలోనికి వచ్చు వరకూ మిగిలిన ప్రభలు కూడా ఎదురుచూస్తూ ఉండడం ఈ ప్రభలల్లో విశేషం. నిండు ప్రవాహంలో వీరేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జన సందోహ ఆనందానికి అవధులుండవు. అలా ఏకకాలంలో ఏకాదశరుద్రులను ఒకే వేదికపై దర్శించి తరించవచ్చు ననే సంకల్పంతో భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తారు.
జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని వీక్షించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు, దేశ విదేశాలలో స్థిరపడిన ఈ ప్రాంతవాసులందరూ ఈ తీర్థంలో పాల్గొంటారు. ఈ ఏకాదశ రుద్రుల అనుగ్రహంకోసంఎక్కడెక్కడినుంచో భక్తుజన సందోహం జగ్గన్నతోట ప్రభల ఉత్సవములో లక్షలాది మందిగా వచ్చి పూజలు నిర్వర్తిస్తారు

- చోడిశెట్టి శ్రీనివాస్