సబ్ ఫీచర్
శ్రామికుల నైపుణ్యం పెంచాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగంలోనూ శ్రామికుల పాత్ర కీలకం. యంత్రాలు వున్నా వాటిని నడపవలసింది వ్యక్తులే కదా. అందువల్లే చాలాకాలం క్రితమే శ్రామికులకు, వారి నైపుణ్యతకు ప్రాధాన్యం ఇవ్వబడింది. అర్ధశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ శ్రమ విభజన అవసరమని స్పష్టం చేశారు. శ్రమ విభజన ద్వారా కలిగే నైపుణ్యతను మనం ఇంతకాలం నిర్లక్ష్యం చేశామనే చెప్పాలి. కేవలం డిగ్రీలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చాం. దీనివల్ల విద్యావంతులు కూడా ఆర్థికాభివృద్ధికి తోడ్పకలేకపోతున్నారు. అమెరికాలో పరిస్థితి ఇలా వుండదు. ప్రతి విద్యార్థి పాఠశాల విద్య పూర్తిచేసే నాటికి కొంత నైపుణ్యత సంపాదించుకుంటాడు. పెద్ద చదువులు చదవాలని కొందరే ప్రయత్నిస్తారు. మన దేశంలో బీటెక్ డిగ్రీ వున్నా ఉపాధి పొందలేకపోతున్నారు. మన దేశంలో ఉపాధి కల్పించే యాజమాన్యాలలో 53 శాతం మంది నైపుణ్యంగల కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నారు. మన జనాభాలో దాదాపు మూడోవంతు నైపుణ్యం లేనివారే.
శ్రామిక ఉత్పాదకత పెరగాలంటే మూల ధన వస్తువులు, నేర్పరితనం వుండాలి. నేర్పరితనం విషయంలో మనం బాగా వెనకబడి వున్నాం. యువతలో 10 శాతం మంది మాత్రమే నైపుణ్యతను పొంది వున్నారు. ప్రస్తుతం ఆర్థిక రంగం ఆధునీకరణకు ప్రాముఖ్యతనిస్తున్నది. వ్యవసాయ రంగంలో కూడా యాంత్రీకరణకు ప్రాధాన్యం పెరిగింది. అందువల్ల కార్మికులు తప్పనిసరిగా తమ నైపుణ్యతను పెంచుకోవాలి. మన ప్రధాని కూడా భారతదేశంలో తయారుచేయమని పిలుపిచ్చారు. పారిశ్రామిక రంగంలో ఆధునీకరణ జరిగితే నైపుణ్యతగల కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతాయి. మన చిన్న తరహా పరిశ్రమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆధునీకరణపైన, కార్మికుల నైపుణ్యతపైన ఆధారపడవలసి వుంది.
నైపుణ్యతను పెంచే కార్యక్రమానికి నిధుల కొరత వుంది. ప్రభుత్వం 2022 నాటికి 50 కోట్ల యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. ఈ కార్యక్రమానికి 5 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా. అంతేకాదు, వివిధ రకాల నైపుణ్యతలు కావాలి. పారిశ్రామికవేత్తలు కూడా ఈ విషయంలో చొరవ చూపాలి. వర్శిటీ- పరిశ్రమల అనుసంధాన కేంద్రాలను స్థాపించి, పరిశ్రమలకు ఎటువంటి నైపుణ్యాలు కావాలో పరిశీలించాలి. వర్శిటీలు ఈ నైపుణ్యాలను సమకూర్చడంలో ముందుండాలి. దీనివల్ల విద్యార్థులు, వర్శిటీలు, పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయి. అంతేకాదు, మన వస్తువులు మన దేశంలోనే తయారుచేయడానికి వీలుంటుంది. ఈ విషయంలో చైనా ముందు వరసలో వుంది.
ఇప్పటికే దేశంలో జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి) వంటి ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 450 జిల్లాల్లో 37 నైపుణ్య మండళ్ళు, 220 మంది భాగస్వాములతో కూడిన 3611 శిక్షణా కేంద్రాలు వున్నాయి. ఇప్పటివరకు ఈ సంస్థ 55 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. వీరిలో 61శాతం మంది ఉపాధి పొందారు. ఇంకొక విషయం. శ్రామికుల నైపుణ్యత పెంచడంతోపాటు, ఉపాధి అవకాశాలను కూడా పెంచాలి. ఉపాధి కల్పనాశక్తి ఎక్కువగా వున్న రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఉదాహరణకు, చిన్నతరహా పరిశ్రమలు, పర్యాటక రంగం వ్యవసాయ ఉత్పత్తులతో వ్యాపారం (ఆహార శుద్ధి పరిశ్రమ లాంటివి) రంగాలలో ఉపాధి కల్పన అవకాశాలు బాగా వున్నాయి. సమకూర్చే నైపుణ్యాలు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వుండాలి. ఏ నైపుణ్యమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నట్లయతే అది మనగలుగడమే కాదు, సుస్థిర ఉపాధిని కలుగజేస్తుంది. అందువల్లనే నైపుణ్యాన్ని కలిగివుండటం ఒక ఎత్తయతే దాన్ని మారుతున్న కాలానుగుణంగా మెరుగు పరచడం మరో ఎత్తు.