సబ్ ఫీచర్

సాయం చేయని కేంద్రంపై సమరం ఇలాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపీ ప్రయోజనాలను రాజకీయ కోణంలో చూస్తూ ఐదు కోట్లమంది ఆంధ్రుల భవిష్యత్తుతో మోదీ సర్కారు చెలగాటమాడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ‘ప్రత్యేక హోదా’ ఇవ్వం పొమ్మన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేది లేదని సంబంధిత అధికారులు కుండబద్దలు కొట్టారు. ‘రైల్వే జోన్‌తో ఏమొస్తుంది? జనరల్ మేనేజర్ పోస్టు మినహా..!’ అంటూ హేళన చేస్తున్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులకు సైతం అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్రం ఏదో ఒక కొర్రీ పెడుతోంది. చివరకు కూలీల ఉపాధి హామీ బిల్లులు కూడా చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వం మొత్తుకుంటున్నది.
ఢిల్లీని మించిన రాజధాని నగరాన్ని ఏపీకి కట్టిస్తామని గొప్పలు చెప్పిన మోదీ తీరా ప్రధానమంత్రి అయ్యాక ఆ ఊసే మర్చిపోయారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా మోదీ తన ప్రసంగంలో- ‘విభజన చట్టాన్ని, ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తాం’ అని ప్రకటించారు. ఇవన్నీ మాటలకే పరిమితమయ్యయి. రాజకీయ కారణాలతోనే మోదీ ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారనడంలో సందేహమే లేదు. ఏపీకి ఎంత చేసినా మాకేమిటి ప్రయోజనం? అన్న రీతిలో బిజెపి పెద్దలు లెక్కలేసుకుంటున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో బిజెపిపై వున్న ప్రజా వ్యతిరేకత తమపై పడకూడదని జాగ్రత్తపడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో మోడీ సర్కారు నుంచి తన ఇద్దరు మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. అవకాశం దొరికినపుడల్లా కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు.
నాడు యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో రాజకీయంగా నష్టపోతామని తెలిసినప్పటికీ అన్ని పార్టీల సమ్మతితోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. అధిక ఆదాయం అందించే రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయి 13 జిల్లాలతో మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా చట్టం తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఏపికి శాపంగా పరిణమించింది. ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో బిజెపి సర్కారు ఏర్పాటు కావడంతో ప్రధాని మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ళు గడుస్తున్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సాయం నామమాత్రమే. చట్టప్రకారం రాష్ట్రానికి చెందవలసినవి దక్కనీయకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు పోరాటాల పర్యవసానంగా తెలుగుదేశం పార్టీ కూడా మోదీ సర్కారుపై నిరసన గళం వినిపించక తప్పని పరిస్థితి ఎదురైంది. తెలుగుదేశం, భాజపాలు ఇపుడు పరస్పరం విమర్శించుకోవటంలో, నిందలు వేసుకోవటంలో బిజీగా వున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అరుణ్ జైట్లీని గతంలో అసెంబ్లీ సాక్షిగా వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడు ప్రజాభీష్టాన్ని అర్థం చేసుకొని ‘యూ టర్న్’ తీసుకున్నారు. విభజన వేళ ఢిల్లీలో ఎనిమిది రోజులపాటు నిరవధిక నిరాహారదీక్ష చేశానని, జాతీయ స్థాయిలో తనను మించిన సీనియర్ రాజకీయవేత్త మరొకరు లేరని, జాతీయ పార్టీలతో తనకున్న సంబంధాలపై నిత్యం వల్లె వేసే చంద్రబాబు- బిజెపి తీవ్ర అన్యాయం చేస్తుంటే ఎందుకు వౌనంగా ఉన్నారు? అమరావతికి ఎందుకు పరిమితమయ్యారు? ప్రజలను రెచ్చగొట్టవద్దు.. ఢిల్లీ వెళ్లి పోరాడమంటూ ప్రతిపక్షాలకు సలహా ఇచ్చిన పెద్దమనిషి ఇపుడు ఎందుకు ఢిల్లీ వెళ్ళరు? అఖిలపక్షాల సమావేశం నిర్వహిస్తానని చెప్పి, ఆ మాటే మర్చిపోయారు. పార్లమెంటు సమావేశాలు ముగింపు దశకు చేరిన తరుణంలో హోదా కోసం పోరాడుతున్న అన్ని రాజకీయ పక్షాలు, ఇతర సంఘాలను కలుపుకొని ఢిల్లీలో ఉద్యమించాల్సిన అవసరం ఆయనకు లేదా? నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటుచేసి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపిన జనసేనాని పవన్‌కళ్యాణ్ ఎందుకు ఢిల్లీ గడప తొక్కడం లేదు? అమరావతిలో సభలు పెడితే ప్రయోజనం ఏమిటి? ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ పాదయాత్రకే పరిమితమయ్యారు. కీలక సమయంలో అందరం కలిసికట్టుగా పోరాడితేనే కదా మోదీ సర్కారు మెడలు వంచగలిగేది. రాష్ట్రం కోసం జెండాలను పక్కనబెట్టి ఉమ్మడిగా పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది.
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని సంఘాలు మాత్రమే చిత్తశుద్ధితో గత నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు కోసం పోరాడుతూనే ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీలో నిర్వహించిన ఆత్మగౌరవ దీక్ష, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించారు. ప్రధానమంత్రిగా తాను ఎన్నికైతే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుపై తొలి సంతకం చేస్తానని, విభజన చట్టాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇదే విషయమై పార్లమెంటులో కాంగ్రెస్ పోరాడుతున్నది. ఈ నెలలో జరిగే ఎఐసిసి ప్లీనరీలో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానంలో ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు వంటి అంశాలను చేర్చడం జరిగింది.
ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ బిజెపి సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ప్రకటించడం మంచి పరిణామమే. తెదేపా తన మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించినంత మాత్రాన ప్రభుత్వం దిగిరాదు. వైకాపా అవిశ్వాసం పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేదు. బాధ్యతతో వ్యవహరించాల్సిన ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇదే అదనుగా ఏపీలో ఏ మాత్రం పట్టులేని బిజెపి సైతం లబ్ధిపొందాలని రాజకీయ క్రీడకు తెరలేపింది. ప్రధాని మోదీ ఏపీలోనూ బిహార్ ఫార్ములాను చొప్పించాలని, ప్రాంతాలవారీగా చిచ్చుపెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల బిజెపి రాష్ట్ర నాయకులంతా సమామేశమై రాయలసీమ డిక్లరేషన్ చేయడం ఇందుకు ఉదాహరణ. జాతీయ మీడియాలో ‘ఆంధ్రులవి గొంతెమ్మ కోర్కెలన్న’ట్లు అవాస్తవాలు రాయిస్తున్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు తమ వైఖరిని సమర్థించుకోవడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను మోదీ కనికరించి ఇచ్చినట్లు గొప్పలు చెబుతూ ద్రోహం చేస్తున్నారు. ఏ విధంగా చూసినా బిజెపి, టిడిపి, వైకాపాలు రాష్ట్ర ప్రయోజనాల సంగతి పక్కనబెట్టి ఎన్నికలే లక్ష్యంగా ఆటలాడుతున్నాయనేది స్పష్టమవుతున్నది.
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలం చెందింది. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వల్ల ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు, పెట్టుబడికి రుణం లేక, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం ఉద్యమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కారు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడం, యువనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యంగా కనిపిస్తున్నది. కేంద్రంలో బిజెపి అధికారంలో వున్నంతవరకూ ఏపీకి ఎటువంటి మేలు జరగదని ప్రజలు నిర్థారణకు వచ్చారు. బిజెపికి, దానితో అంటకాగే పార్టీలకు రాష్ట్రంలో అడ్రసులు గల్లంతైపోవడం ఖాయం. నాలుగేళ్ల క్రితం ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పట్ల ఏపీలో ఇపుడు సానుభూతి పవనాలు వీస్తున్నాయి. విభజన చట్టం ద్వారా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ చేసిందని, దానిని అమలు చేయకుండా బిజెపి నాటకాలాడుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వున్నది. ఇందుకనుగుణంగానే ఏఐసిసి ప్లీనరీ డిక్లరేషన్‌లో సదరు అంశాలను చేర్చారు.

- కొలనుకొండ శివాజీ సెల్ : 98662 00463