బ్యూరోక్రాట్లు సమన్వయంతో పనిచేయాలి
Published Saturday, 10 December 2016హైదరాబాద్, డిసెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయడం, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేందుకు బ్యూరోక్రాట్లు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంశాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య సూచించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లు కనపడుతోందని, ఎవరిపని వారు చేసుకుని పోతున్నారన్నారు. శుక్రవారం ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐఎఎస్ అధికారుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, గతంలో ఐఎఎస్ అధికారులకు విశేషమైన అధికారాలు ఉండేవని, అలాగే సమష్టి భాగస్వామ్యంతో అధికారులు పనిచేసేవారన్నారు.