వాహ్..నిత్యా!
Published Sunday, 3 April 2016అంటున్నారు టాలీవుడ్ జనాలు. అందుకు కారణం లేకపోలేదు. టాలీవుడ్ సూపర్స్టార్ ప్రిన్స్ మహేష్బాబుతో నటించాలని ఊవ్విళ్లూరని భామలు వుండరు. అంతెందుకు సౌత్ భామలే కాదు...నార్త్ బ్యూటీస్ దీపికాపదుకొనే, కత్రినాకైఫ్, కంగనారనౌత్ లాంటి క్రేజ్గాళ్స్ కూడా టాలీవుడ్లో ప్రిన్స్ సరసన అంటే రెడీ అనేస్తారు. అక్కడా..ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా ‘ప్రిన్స్’కున్న క్రేజ్ అంతటిది మరి! అయితే ఈ కేరళ కుట్టీ నిత్యామీనన్ మాత్రం మహేష్ చిత్రంలో అవకాశం వస్తే ‘నో’ చెప్పేసిందట! ‘బ్రహ్మోత్సవం’ సినిమా తర్వాత సెట్స్పైకి వెళ్లనున్న మురుగదాస్ సినిమాలో నిత్యామీనన్ అయితే బావుంటుందని దర్శకుడు నిత్యాకు కథ వినిపించారట. కథ విన్నాక నిర్మొహమాటంగా ‘సారీ’ అని చెప్పేసిందని తెలిసింది. ఈ కథలో తన పాత్రకు అస్సలు ప్రాముఖ్యతే లేకపోవడమే ఇందుకు కారణం అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. మహేష్బాబు సినిమా వదులుకోవడమంటే మాటలు కాదు..వాహ్..నిత్యా..రియల్లీ గ్రేట్ అనకుండా వుండలేం కదా!!
దటీజ్..ప్రియాంక!!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంటే మాటలు కాదు..ఆమె వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. అటు సినిమాల్లో అయితేనేమి..ఇటు నిజ జీవితంలోనైతేనేమి అంతటా ఆమెకు ఆమే సాటి అనిపించుకునేలా ఉంటుంది. పొందిన విజయాల్ని తనివితీరా ఆస్వాదించే సమయం కూడా తనకు దొరకడం లేదని చెబుతోంది. ‘క్వాంటికో’ సిరీస్తో అంతర్జాతీయంగా చక్కటి పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ సుందరి. అలాగే ‘బేవాచ్’ చిత్రంతో ప్రతినాయిక పాత్ర ద్వారా హాలీవుడ్లోకి దూసుకెళుతోంది. బాలీవుడ్లో మహిళా ప్రధాన కథాంశాలు, కమర్షియల్ చిత్రాలతో తన ఫవరేంటో రుచిచూపిస్తోంది. లభిస్తున్న విజయాలు నటిగా నా బాధ్యతను మరింత పెంచుతున్నాయంటోంది. అయితే ప్రియాంక సాధిస్తున్న విజయాలు చూసి తోటి తారలే ఈర్ష్యపడుతున్నారట. అవునా..అని చోప్రాని కదిలిస్తే- ‘‘ఒకరి ఈర్ష్యతో నాకు పనేంలేదు. అంతగా ఆలోచించే తీరిక కూడా నాకు దొరకడం లేదు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటాను. చిత్రసీమలో అవకాశాలు అందుకోవడానికి ప్రతిభ మాత్రమే కొలమానంగా ఉపకరిస్తుంది. నా ప్రతిభాసామర్థ్యాల వల్లే ఉన్నత స్థానానికి చేరుకున్నాను. హీరోయిన్గా ఇనే్నళ్లలో సాధించిన ప్రగతిని చూసి సంతృప్తి చెందడం నాకు నచ్చదు. అలా ఆలోచిస్తే అభివృద్ధి ఇక అటకెక్కినట్లేనన్నది నా అభిప్రాయం. జయాపజయాలు పట్టించుకోకుండా నా ప్రయాణాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉంటాను. నేను సాధించిన ప్రతి విజయం నటిగా నా బాధ్యతను రెట్టింపు చేస్తూనేవుంది. నటిగా పాత్రలకు న్యాయం చేస్తూనే దర్శక,నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టడానికే నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను’’అంటూ ఎంతో తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. దటీజ్..ప్రియాంక!!
ఎటువైపునకో..!!
టాలీవుడ్లోకి ‘నేను శైలజ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కథానాయిక కీర్తి సురేష్కు ఇక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆమె అందుకు విరుద్ధంగా వస్తున్న అవకాశాలకు ‘నో’ చెప్పేస్తుండడంతో అసలు ఏం జరుగుతుందన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ముఖ్యంగా టాప్ స్టార్లతో వచ్చిన అవకాశాలను కూడా ఎందుకు వదులుకుందో తెలియడం లేదట. కోలీవుడ్లో విజయ్, ధనుష్, శివకార్తికేయన్ వరకు అందరి సరసన అవకాశాలు సంపాదించుకుంది. అయితే టాలీవుడ్లో మహేష్బాబు, రామ్చరణ్ వంటి హీరోలతో నటించడానికి కూడా ససేమిరా అందట. అందుకు కారణం లేకపోలేదట. ఆమెకు గ్లామర్ షోకు నో చెప్పేయడంతోనే ఇదంతా జరిగిందని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయ్. టాలీవుడ్లో ఎక్కువగా టాలెంట్ కన్నా గ్లామర్షోకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని గ్రహించిన కీర్తి ఇక తప్పదనుకుందో ఏమో..తాజాగా ఓ ఫొటో షూట్లో పాల్గొంది. ఇందులో ఈ భామ వేషధారణ, ఫోజులు అద్భుతంగా ఉన్నాయని, ఆమె గ్లామర్షోతో, అందాల ఆరబోతతో అదిరిపోతుందని అందరూ అనుకుంటున్నారు. దీంతో కీర్తి ఒట్టుతీసి గట్టున పెట్టేసిందంటున్నారు కూడా. ప్చ్..చూద్దాం..కీర్తి కెరీర్ ఎటువైపునకో..!!