సబ్జాతో చలువ
Published Monday, 11 April 2016శరీరంలో వేడి తగ్గడానికి, జీర్ణశక్తి పెరగడానికి, బరువు తగ్గడానికి, మలబద్దకం నివారించడానికి సబ్జాగింజలతో చేసే పానీయం ఉత్తమం. మండువేసవిలో ఈ గింజలను ఉపయోగించి పానీయాలు తీసుకుంటే శరీరానికి చలవతోపాటు ఆరోగ్యం కుదుటపడుతుంది. విభూది తులసిగా చెప్పుకునే సబ్జామొక్కల గింజలు నల్లగా ఉంటాయి. వీటిని నీటిలో లేదా పెరుగు, ఐస్క్రీమ్, షర్బత్లలో వేస్తే కొద్దిసేపటికి తెల్లటిగుజ్జుతో ఉబ్బుతాయి. అలా ఉబ్బిన తరువాత ఆ పానీయాన్ని తాగితే ఎంతో మేలు. వాటిలో ఉండే పీచుపదార్థాలవల్ల అన్నవాహికకు మేలు జరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య నివారించబడుతుంది. ఆకలి తగ్గి శరీరం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వీటి ఆకులు మంచి వాసనతో ఉంటాయి. మధ్యప్రాచ్యం, కొన్ని ఆఫ్రికా దేశాల్లో వీటి ఆకులతో మంచిమంచి వంటకాలు చేస్తారు. తులసి జాతికి చెందిన సబ్జా ఓ మూలిక జాతిమొక్క.