S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిత్తిలోనె సుఖమునకై తిరిగెనీప్రాణి!

‘మనుష్యాణాం సహహ్రేషు’ అన్నాడు గీతాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారో, అన్ని రకాల మనస్తత్వాలున్నాయి. లోకంలో ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. ఒకేలా మాట్లాడరు. ఆలోచించరు. ఉన్నదున్నట్లుగా అందుకుని జీవితాన్ని సఫలం చేసుకుని బతికేవాడు ఉత్తముడు.
భగవద్గీత కొంత వయసు మళ్లిన తర్వాత ఎక్కడో ఓ మూల కూర్చుని చదివే గ్రంథమని కొందరనుకుంటారు.
దాని స్థాయికి ఎదగలేక దాన్ని తన స్థాయికి దించేసి, ఆ కాస్తా ఏదో అర్థమై పోయిందనుకునేవాడు మధ్యముడు. అసలదేమిటో తెలియకుండా అర్థమై చావక పామరంగా బ్రతికేవాళ్లే ఎక్కువ. వాళ్లు మందాధికారులు.
అందుకే, పోతన, త్యాగయ్య లాంటి ఉత్తములైన భక్తాగ్రేసరులు గీతా సందేశాన్ని సరైన సమయంలో పట్టుకుని వారి జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. జాతిపితను మహాత్ముణ్ణి చేసినది గీత. లోకంలో అందరూ అలా తరింపబడాలనే వాంఛించారు. వారి దారులు వేరు కావచ్చునేమో గాని, లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకరు పద్యాన్ని ఆశ్రయించారు. మరొకరు కీర్తనగా పాడుకున్నారు. సర్వసాక్షి ముందు సర్వస్వాన్ని అర్పించుకుని హాయిగా స్వేచ్ఛగా బ్రతికారు. దైవం ముందు కూర్చుని ఇది కావాలి, అది కావాలి అని ఏదీ అడగలేదు. అసలు అడగాలనే ఆశే లేదు. వారికి ఏది కావాలో, అదే దైవం వాళ్లకిచ్చాడు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా సరిగ్గా ఇదే చెప్పాడు. దైవమున్నది అడిగిందల్లా ఇచ్చేసుకుంటూ పోవడానికి కాదు. మనం అడిగామా? కర్మేంద్రియాలిచ్చాడు. జ్ఞానేంద్రియాలిచ్చాడు. ఇంతకంటే మనిషై పుట్టిన వాడికి ఏం కావాలి?
కానీ ఇక్కడే ఉంది తిరకాసు. మనిషి జీవన స్థితి ఎలా ఉంటుందంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు కాదు కదా! లోపలే ఉంటూ ఏ పని, ఎలా చేయాలో, పరమాత్మ చెప్తూనే ఉంటాడుగా! ఏమో? ఏ పనీ చేయలేకపోతున్నా. నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా? నా పనులన్నీ నువ్వే కాస్త చేసి పెట్టకూడదా? అని భక్తుడు అంటూంటాడు. అదీ గమ్మత్తు.
చిత్తశుద్ధితో చేసిన పనులకు లోకము మెచ్చును, దైవము మెచ్చును’ అంటాడు అన్నమయ్య.
మనిషిలో లోపించే గుణం ఈ చిత్తశుద్ధే. చిత్తశుద్ధిలేని శివపూజ యేలరా? విశ్వదాభిరామ! అన్నాడు వేమన.
చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని కోరేవారుంటారు. చేస్తున్నట్లు నటిస్తూ ఫలితాన్ని పొందాలనుకునే వారుంటారు. అసలు పని చేయకుండానే అప్పనంగా ఫలితం రావాలనుకునే వారుంటారు. ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా ఈ మూడు రకాల వారిని దేవుడు తన దగ్గరకు రానివ్వడు. చేసిన దానికి ఎంతో కొంత ఫలితం తప్పదు. అది ఎంత? అనేది నిర్ణయించేది దైవం. అదే ప్రసాదంగా భావిస్తే ఏ చిక్కూ ఉండదు. కానీ సరిపోదు. ఉన్నదానితో తృప్తి ఉండదు.
త్యాగయ్యకు సంసారముంది. సంతానముంది. అది కించిత్ భోగమే. ఉన్న ఒక కూతురు గతించింది. మొదటి భార్య గతిస్తే ఆమె చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. సంసార బాధలేం పడ్డాడో, తిన్నాడో, తినలేదో మనకు తెలియదు. మనకు తెలిసినది ఆయన సంగీతం మాత్రమే. సుఖం సంగతి ఏమో గానీ సామాన్య సంసారం పడే బాధలన్నీ త్యాగయ్య అనుభవించే వుంటాడు. ఆయన కీర్తనలో బాగా కనిపిస్తుంది. కానీ అన్నీ వదిలేసి సంగీతానికే ప్రాధాన్యత ఇచ్చి జీవనాన్ని సాగించాడు. చిరస్మరణీయుడవడానికి ఇదే కారణం.
సంగీతాన్ని నమ్ముకున్న వారి జీవితాలు సవ్యంగానే సాగుతాయని నిరూపించాడు. మార్గదర్శియై నిలిచాడు.
ప్రతి కీర్తనలోనూ, ఆయన హృదయాన్ని ఆవిష్కరించాడు. ఎన్ని తరాలు గడిచినా మనకు ఆ పుణ్య పురుషుల మార్గమే శ్రేయోదాయకం. మరో గత్యంతరం లేదు.
త్యాగయ్య గారి కీర్తనలలో తోడి రాగంలో ఈ కీర్తన చాలా అపురూపమైనది. తరుచు వినబడనిది.
పల్లవి:
పొద్దుపొయ్యేని శ్రీరాముని
పూని భజింపవే మనసా॥

నిద్దుర చేత కొన్నాళ్లు విఃయ
బుద్ధులచేత గొన్నాళ్లు మనసా ॥

చరణం
పొద్దున లేచి త్రి తాపములను నరుల
పొగిడి పొగిడి కొ -న్నాళ్లు వట్టి
ఎద్దురీతి కన్న తావున భుజియించి
ఏమీ తెలియక కొన్నాళ్లు ॥

చరణం -2
ముద్దుగ దోచే భవసాగరమున
మునిగి దేలుచు గొన్నాళ్లు
పద్దుమాలిన పామర జనులతో వెర్రి
పలుకు లాడుచు గొన్నాళ్లు ఓ మనసా ॥

చరణం -3
యాగాది కర్మములను సేయవలెనని
అసలట చేత కొన్నాళ్లు అందు
రాగ లోభములతో నపరాధముల జేసి

రాజసమున గొన్నాళ్లు
బాగుగ నామకీర్తనలు సేయుటె
భాగ్యమనక కొన్నాళ్లు
త్యాగరాజ నుతుడైన శ్రీరాముని
తత్త్వము తెలియకనే కొన్నాళ్లు ॥

పొద్దుపొయ్యేని శ్రీరాముని
పూని భజించవే మనసా ॥
జీవితంలో సగభాగం నిద్దురకే సరిపోతుంది.
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి ఉండదు. ఇంకెందుకు ఆ జీవితం? ఎవరిని ఉద్ధరించడానికి? తెల్లారితే చాలు తన స్వార్థం కోసం, అప్రయోజకుడని తెలిసినా అడ్డమైన ప్రతి వాడినీ ఇంద్రుడనీ చంద్రుడనీ దిక్కుమాలిన పొగడ్తలతో ముంచెత్తేస్తూ పబ్బం గడిపేవాళ్లు, అదే పరమావధిగా బ్రతికే వాళ్ల చెంప ఛెళ్లుమనిపించాడు. శుచీ, శుభ్రత లేని రోడ్లపై ప్రతి చోట ఎద్దులా ఆగిపోతూ విచక్షణ లేకుండా క్షుద్బాధ తీర్చుకునే వారినీ వదలలేదు. అలాటి దృశ్యాలు రోడ్లపై ఈ వేళ మనం చూస్తూనే ఉన్నాం.
నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనే అహంకారంతో కొన్నాళ్లు రుణం కాస్తా తీరిపోగానే ఏడుపుతో కొన్నాళ్లు, ఎదుటి వారు బాగుంటే ఏడుపు, తనకు లేదనే ఏడుపుతో కొన్నాళ్లు తీరా కాలమంతా అయిన తర్వాత ఏమీ చేయలేక పోయానే మరో ఏడుపుతో కొన్నాళ్లు, బ్రతికి ఏమి సుఖం? అని తనకు తాను ప్రశ్నించుకుని రుజువైన మార్గం తప్పకుండా బ్రతికిన త్యాగయ్య కంటే జ్ఞాని ఉన్నాడా అనిపిస్తుంది - అంతా పరికిస్తూనే సంగీతాన్ని వదల్లేదు.
మనకు చివాట్లు పెట్టే ప్రతి సందర్భంలోనూ లోపల మనసును ఓ చిటిక వేసి పిలుస్తాడు త్యాగయ్య.
అవసరమైతే రెండు మూడు చరణాలు జోడించి ఆ కీర్తనను సుసంపన్నం చేస్తాడు. పాటకులకు రాగం ఒక్కటే అందుతుంది. భావం జోలికి వెళ్లలేరు అందరూ.
చాలు. పాడగాపాడగా ఎప్పటికైనా ఫలితం రాకుండా ఉంటుందా?

- మల్లాది సూరిబాబు 90527 65490, 9182718656