వైభవంగా సాయినాథుని గ్రామోత్సవం
Published Friday, 22 July 2016ధర్మవరం రూరల్, జూలై 21: పట్టణంలో గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా గురువారం షిరిడీ సాయినాథుని గ్రామోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గ్రామోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన జానపద కళాకారులు నిర్వహించిన అష్టలక్ష్మిల నాట్యం అందరినీ ఆకట్టుకుంది. గురువారం షిరిడీ సాయిబాబా ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరింపబడిన వాహనంలో సాయినాథుడు కొలువుదీరి పట్టణ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ రథాన్ని సేవా సమితి సభ్యులు విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా అలంకరించారు. అలాగే సాయినాథుని గుంటూరు జిల్లా నుంచి వెంకటేశ్వర జానపద కళాకారుల బృందం ఆధ్వర్యంలో గ్రామోత్సవంలో భాగంగా అష్టలక్ష్మిల వేషధారణలతో నాట్య ప్రదర్శనలు చేస్తూ గ్రామోత్సవంలో సాయినాథుని ముందు ప్రదర్శనలు ఇవ్వడం అశేషంగా భక్తులను ఆకట్టుకుంది. సాయినాథుని ఆలయం నుంచి ఆర్టిసి బస్టాండు, కళాశాల సర్కిల్, కళాజ్యోతి, పిఆర్టి, గాంధీ సర్కిల్, తేరుబజారు వీధులగుండా పట్టణంలోని పలు వీధుల్లో సాయినాథుడు భక్తులకు దర్శనమిచ్చారు.