ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమం
Published Friday, 22 July 2016రాయచోటి, జూలై 21:కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు ఉద్యమం ఉద్ధృతం చేస్తామని, ఫ్యాక్టరీని సాధించే వరకు ఉద్యమం ఆగదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్మద్ది ఈశ్వరయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏఐవైఎఫ్ ఏరియా నాయకుడు వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వలన 10 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా సెయిల్ ఆధ్వర్యంలో పరిశ్రమ నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా పట్ల వివక్షత చూపుతోందని విమర్శించారు. కడప ఉక్కు - రాయలసీమ హక్కు నినాదంతో గ్రామస్థాయిలో ఉద్యమం నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్రిష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని, ఒక ఉద్యోగం కూడా ఇంత వరకు ఇవ్వలేదని విమర్శించారు. యువతకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలుచేయాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, నల్లధనాన్ని వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీ ఐ ఏరియా కార్యదర్శి విశ్వనాధ్, ఏరియా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాద్యక్షులు చండ్రాయుడు, మల్లిఖార్జున, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోటేశ్వర్, ఏఐవైఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.