ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ‘సుప్రీం’ నోటీసు
Published Saturday, 23 July 2016న్యూఢిల్లీ, జూలై 22: గత ఏడాది జూన్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు మత్తయ్యపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. కాగా ఈ కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మత్తయ్యపై వచ్చిన ఆరోపణలపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. గత సంవత్సరం జూన్ 12న జరిగిన శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు ఇవ్వజూపారన్న అభియోగంపై రేవంత్రెడ్డితోపాటు పలువురు టిడిపి నేతలపై ఏసిబి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.