టెక్స్టైల్ పార్క్కు 7న శంకుస్థాపన
Published Saturday, 23 July 2016హైదరాబాద్, జూలై 22: వరంగల్లో ఆగస్ట్ 7న జరగనున్న టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. అదే రోజున తెలంగాణ టెక్స్టైల్ పాలసీని ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించే ఈ పాలసీ ద్వారా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యవసాయ రంగం తరువాత అధికంగా ఉపాధి, ఉత్పత్తి, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే కీలక రంగం చేనేత, టెక్స్టైల్ రంగం అని అన్నారు. తెలంగాణలో పత్తి ఉత్పత్తి 60 లక్షల బేళ్లయితే అందులో రాష్ట్రం ఉపయోగించుకుంటున్నది కేవలం పది లక్షల బేళ్లని కెటిఆర్ తెలిపారు. ఈ రంగంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని కాటన్ ఉత్పత్తి ఆధారిత అనుబంధ పరిశ్రమలను పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.