రైతులకు రుణమాఫీ పత్రాలు అందించాలి..
Published Saturday, 23 July 2016గాలివీడు, జూలై 22: మండలంలో చాలా మంది రైతులకు రుణ అర్హతా పత్రాలు అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొదటి విడత రుణ మాఫీలో భాగంగా అందరి రైతులకు రుణమాఫీ వర్తించింది. అయితే రెండో విడత మాత్రం చాలా మంది రైతులకు రుణ అర్హతా పత్రాలు అందకపోవడంతో రైతులు రుణమాఫీ వర్తిస్తుందో లేదోనని దిగాలుపడ్డారు. వ్యవసాయాధికరుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వారీగా రైతులతో గ్రామసభలు నిర్వహించి రుణమాఫీ పత్రాలు అందజేశారు. అయితే ఇంకా పది శాతం మంది రైతులకు రెండో విడత రుణమాఫీ పత్రాలు అందలేదు. దీంతో దిక్కుతోచని రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే వారు కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం మాత్రం రుణాలు పొందిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులలో మాత్రం ఆందోళన తగ్గలేదు. పంట రుణాలు, బంగారు రుణాలు పొందిన రైతులకు రెండో విడత రుణమాఫీ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.