గ్రీనరీ పర్యవేక్షణకు గ్రీన్బుక్
Published Saturday, 23 July 2016హైదరాబాద్, జూలై 22: తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన గ్రీనరీని పర్యవేక్షించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రతి పరిశ్రమలోనూ మూడవ వంతు చెట్ల పెంపకం ఉండాలని, ఈ వివరాలు ఆన్లైన్లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీని కోసం గ్రీన్ బుక్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ గ్రీన్ బుక్ ద్వారా ప్రతి పరిశ్రమ యూనిట్ తాము పెంచుతున్న చెట్ల వివరాలను జియో మ్యాపింగ్ చేస్తారని చెప్పారు. జియో ఫెన్సింగ్ పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు గ్రీనరీ పెరుగుదలను పర్యవేక్షిస్తామని చెప్పారు. ప్రతి పరిశ్రమ ఇచ్చే వివరాలను ఆన్లైన్లో పొందు పరుస్తారు. ఫోటోగ్రాఫిక్ విధానం ద్వారా ప్రతి పరిశ్రమను సర్వే చేస్తారు. వచ్చే మూడేళ్లలో నిబంధనల మేరకు మూడవ వంతు గ్రీనరీ ఉండేట్టు చర్య తీసుకుంటామని చెప్పారు. ఈ నిబంధన ఉన్నా ఇంత కాలం పరిశ్రమలు పట్టించుకోలేదని హరిత హారంతో పరిశ్రమల్లో మార్పు రావాలని అన్నారు. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. ఈ ఏడాది పరిశ్రమల శాఖ ద్వారా 42లక్షల మొక్కలు నాటినట్టు చెప్పారు. 176 పారిశ్రామిక పార్కుల్లో పది లక్షల 74వేల మొక్కలు నాటినట్టు తెలిపారు.
సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న తెలంగాణ మంత్రి కెటిఆర్