వివక్ష లేని అభివృద్ధి
Published Saturday, 23 July 2016రాజమహేంద్రవరం, జూలై 22: తన హయాంలో నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో రూ. 135.07కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ పంతం రజనీశేషసాయి వెల్లడించారు. అభివృద్ధిలో ఎక్కడా వివక్షతకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పాలకవర్గ హయాంలో రాజమహేంద్రవరం అభివృద్ధిపథంలో పయనిస్తోందని, పారదర్శకంగా పాలన సాగుతోందన్నారు. ఆదాయ సాధన, అభివృద్ధి విషయంలో నగరపాలక సంస్థ వృద్ధిని సాధించిందన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు, ఇతర పనుల కోసం జెసిబి, బుల్, పారిశుద్ధ్య పనులకు డంపర్లు, మంచినీటి సరఫరాకు 7 ట్యాంకర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. జోన్ల విధానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టామని, దీనిలో భాగంగా 3జోన్లలో పర్మినెంట్ కార్మికులు, ఒక జోన్లో సొసైటీ కార్మికులు పనిచేస్తారని తెలిపారు. మంచినీటి వృధాను నివారించేందుకు త్వరలో కుళాయిలకు మీటర్లు బిగించనున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఈఏడాది నుంచి ఇంగ్లీషుమీడియం విద్యను, ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రారంభించామన్నారు.