నియోజకవర్గంలో రెండు లక్షల మొక్కలు
Published Saturday, 23 July 2016మచిలీపట్నం (కల్చరల్), జూలై 22: బందరు నియోజకవర్గంలో రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జార్జికారోనేషన్ హైస్కూల్లో శుక్రవారం వసుధ ఫౌండేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కల పెంపకం తప్పనిసరన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత, వాతావరణ కాలుష్య నివారణకు విధిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అలాగే భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంటలు తవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, వసుధ ఫౌండేషన్ ప్రతినిధి చంద్రశేఖర్, జార్జికారోనేషన్ హైస్కూల్ కార్యవర్గ సభ్యులు చిత్రపు నారాయణమూర్తి, ఆర్ఎల్ కృష్ణ, హెచ్ఎం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.