చైనా బృందం పర్యటన
Published Saturday, 23 July 2016మచిలీపట్నం, జూలై 22: మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (మడ) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ‘మడ’ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారీ చేసేందుకు గాను శుక్రవారం చైనాకు చెందిన జిఐఐసి బృందం బందరులో పర్యటించింది. ఇప్పటికే పలు విడతలు బందరులో పర్యటించిన చైనా బృందం మరోసారి వచ్చి మంగినపూడి బీచ్, పోర్టు భూములు, బందరు కోటను పరిశీలించింది. స్థానిక ఆర్అండ్బి అతిధి గృహంలో మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావులు చైనా బృందాన్ని కలుసుకుని మడ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రస్తుత పట్టణ స్థితిగతులు, వౌలిక సదుపాయాలు భవిష్యత్తులో రాబోయే పోర్టు, పరిశ్రమలు, మెగా టౌన్షిప్, జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి వనరులు తదితర అంశాలను చైనా బృందం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. మడ అభివృద్ధితో పాటు మంగినపూడి బీచ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మడ పరిధిలో పోర్టు, పరిశ్రమలు, మెగా టౌన్షిప్ అభివృద్ధి ప్రతిపాదనలు త్వరలో సాకారం అయ్యేందుకు చైనా బృందం అధ్యయనం చేస్తోందన్నారు. ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించడం, డ్రైన్ వాటర్ శుద్ధి చేసి పరిశ్రమలకు వినియోగించడం తద్వారా నీటి వనరులు సద్వినియోగం చేసుకునేందుకు ఈ బృందం పరిశీలన జరుపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ఆర్డీవో సాయిబాబు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు.