రాతి క్వారీలో ప్రమాదం
Published Saturday, 23 July 2016కంచికచర్ల, జూలై 22: రాతి క్వారీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని పరిటాల గ్రామ పంచాయతీ శివారు దొనబండ క్వారీలో శుక్రవారం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్వారీ కొండపై నుండి రాయి ప్రమాదవశాత్తు కింద పడటంతో ఒరిస్సాకు చెందిన కార్మికుడు రూబెన్ బాబు (25) అక్కడికక్కడే మృతి చెందగా నిఖిలేష్ నిహార్ (26) , ఉప్పతోళ్ల శివకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో నిఖిలేష్ నిహార్ మృతి చెందాడు. శివకృష్ణ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. మృతులు ఇద్దరూ ఒరిస్సాకు చెందిన కార్మికులు కాగా ఇద్దరు వివాహితులే. ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నారు. కార్మికుల కళ్ల ఎదుటే ఈ దుర్ఘటన జరగడంతో సహచర కార్మికులు భయాందోళనకు గురి అయ్యారు. ఎస్ఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.