ఉత్తీర్ణతా శాతం కాదు... నాణ్యత పెరగాలి
Published Saturday, 23 July 2016జగదాంబ, జూలై 22: విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరగడం ముఖ్యం కాదు వారికి నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమని కలెక్టర్ యువరాజ్ అన్నారు. శుక్రవారం ఎయులోని అంబేద్కర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి హైస్కూళ్లు, మున్సిపల్ హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేస్తూ బాధ్యతతో పనిచేయాలన్నారు. నిర్ణీత సమయంలో విధులకు హాజరవుతూ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలన్నారు. తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు మొక్కల పెంపకం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో పూర్తి స్థాయిలో ఫర్నీచర్ ఉండాలన్నారు. తాగునీటి సౌకర్యం ఉండాలన్నారు. డిఇఒ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెరిగిందన్నారు. ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతలు తవ్వించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఇఒలు నాగమణి, సివి రేణుక, పరీక్షల విభాగం ఎసి రాంబాబు, ఎంఇఒలు. హెచ్ఎంలు పాల్గొన్నారు.