ఎత్తుబ్రిడ్జిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
Published Saturday, 23 July 2016విజయనగరం(టౌన్), జూలై 22: వేలాది వాహనాల రాకపోకలు సాగించే 26వ నెంబర్ జాతీయ రహదారి ఎత్తు బ్రిడ్జిపై పెరుగుతున్న రద్దీని క్రమబద్ధీకరించేందుకు పట్టణ ట్రాఫిక్ విభాగం పోలీసులు చర్యలు చేపట్టారు. విశాఖపట్నం- రాయపూర్ జాతీయ రహదారిపై యాభై ఏళ్లకిందట ఎత్తు బ్రిడ్జిని నిర్మించారు. ఇటీవల ఈరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. భారీ వాహనాలు, పట్టణంలోకి వచ్చిపోయే వాహనాల రాకపోకలతో ఈ ఎత్తు బ్రిడ్జివంతెన నిత్యం వందలాది వాహనాలతో ట్రాఫిక్ రద్దీగా ఉంటోంది. విఐపిలు, ముఖ్యనేతలు జిల్లాకేంద్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో ట్రాఫిక్ను నిలువరించి కాన్వాయ్ వాహనాలకు మార్గం సుగమం చేసేవారు. కొద్దిరోజుల కిందట రైల్వే అండర్ బ్రిడ్జిపై రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టినప్పుడు మూడురోజలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు డివైడర్ విధానాన్ని పట్టణ ట్రాఫిక్ పోలీసులు అమలుచేశారు. మరమ్మతులు పూర్తికాగానే తిరిగి మామూలుగా ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇటీవల జిల్లాకేంద్రంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ జెవి రాముడు పర్యటించారు. ఈ సందర్భంలో ఎత్తుబ్రిడ్జిపై డివైడర్ నింబంధనలు తిరిగి ప్రవేశపెట్టారు. ఈ ట్రాఫిక్ విధానం అమలుపై పట్టణ ప్రజలు, వాహనచోదకుల నుండి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో డివైడర్ పద్ధతిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువచ్చారు. దీనిపై పట్టణ ట్రాఫిక్ డిఎస్పీ రాజేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నియంత్రించి మెరుగైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎత్తుబ్రిడ్జిపై ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. పట్టణంలో వాహనచోదకులకు ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.