సింగరేణిలో ఎన్నికల సందడి
Published Saturday, 23 July 2016కొత్తగూడెం, జూలై 22: సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సందడి మొదలయింది. ఒకనాటి ప్రత్యర్థి సంఘాలు ఎఐటియుసి, ఐఎన్టియుసిలు ఈ ఎన్నికల్లో ఐక్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తవడంతో ఇప్పటి నుండి ప్రత్యర్థి సంఘాలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే ఐన్టియుసికి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్, సింగరేణి కాలరీస్ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్లు విలీనం కావాలని ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సమక్షంలో నిర్ణయం జరిగింది. దీంతోపాటు జాతీయ స్థాయిలో ఎఐటియుసి నాయకులతో ఐఎన్టియుసి నాయకత్వం చర్చలు జరుపుతోంది. దీనితో ఎఐటియుసి అనుబంధ సంఘాలు ఐఎన్టియుసి అనుబంధ సంఘాలతో కలిసి బరిలోకి దిగుతాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్ను ఓడించడమే లక్ష్యంగా రెండు యూనియన్లు కలిసి పోటీచేస్తే విజయం తథ్యమని భావిస్తున్నాయి.