మళ్లీ మొదలైన భూసేకరణ
Published Saturday, 23 July 2016గుంటూరు, జూలై 22: రాజధాని ప్రాంతంలో మరోసారి భూ సేక..రణం మొదలైంది.. ఇటీవల వరకు సీఆర్డీయే అధికారులు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో సామాజిక సర్వేని పూర్తిచేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సర్వే, గ్రామసభలు నిర్వహించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని, భూ సమీకరణకు ఇచ్చిన ప్యాకేజీ సేకరణ జరిపే రైతులకు వర్తించదని ముఖ్యమంత్రి ఓ సందర్భంలో స్పష్టం చేశారు. ముందుగా రైతులకు భూ కేటాయింపులు జరిపిన నేలపాడు గ్రామంలో తొలివిడత సేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. గత ఏడాది పెనుమాక గ్రామంలో భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రైతులతో పాటు ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. అంతేకాదు కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీకి మద్దతిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం రాజధాని గ్రామాల్లో పర్యటించి సేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కూడా శాసనసభలో బలవంతపు భూ సేకరణ జరిపే ప్రసక్తిలేదని గతంలో తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ జారీ చేయటం గమనార్హం. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతులకు గతనెలలోనే ముఖ్యమంత్రి లాటరీ పద్ధతిన ప్లాట్లు కేటాయించారు. ఈ గ్రామంలో రాజధాని అవసరాలకు 1326 ఎకరాలు సేకరించారు. తాజాగా ఆర్సీ నెం.. 251/2016జీ-1 ప్రకారం 48 మంది రైతులకు చెందిన 27.68 ఎకరాల భూ సేకరణకు సీఆర్డీయే శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఎకరం రూ. 5 లక్షలుగా మార్కెట్ ధర నిర్ణయిస్తూ పశువుల కొట్టాలు.. (కేటిల్ షెడ్ల)కు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 25వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని మొత్తంగా మూడువేల ఎకరాల వరకు సేకరణ జరిపేందుకు సీఆర్డీయే అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం నేలపాడు గ్రామంలో మార్కెట్ ధర ఎకరం రూ. 80లక్షల నుంచి కోటికి పైచిలుకు ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో తమకు మొక్కుబడిగా రూ. 5లక్షలు కంటితుడుపుగా ఇచ్చి కార్పొరేట్ సంస్థలకు కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపిస్తున్నారు. సేకరణనే రైతులు నిరాకరిస్తున్న తరుణంలో సీఆర్డీయే అధికారులు ఓ అడుగు ముందుకేసి రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కూడా కోల్పోయే అవకాశాలు ఉందని, అందుకు సహకరించాలని, ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లిస్తుందని రైతులను ఒప్పించేందుకు చేసే ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. సేకరణను నిరాకరిస్తూ త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సేకరణ నోటిఫికేషన్ జాబితాలో ఉన్న రైతులు ఆంధ్రభూమికి వివరించారు. కాగా రాజధాని అవసరాలకు సేకరణ జరపాలంటే ముందుగా పెనుమాక నుంచి ప్రారంభించాల్సి ఉంది. గతంలో భూ సమీకరణకు సమ్మతించిన రైతులే ఇప్పుడు వ్యతిరేకిస్తూ తాము 9.2 కింద అభ్యంతరపత్రాలను కూడా జతచేశామంటూ సమీకరణకు నో చెప్తున్నారు.