భయపెడుతున్న ఘాట్లు ఎత్తుపల్లాలు.. అష్ట వంకరలు
Published Saturday, 23 July 2016విజయవాడ, జూలై 22: పుష్కరాలకు కొద్ది రోజుల ముందే పనులు పూర్తి చేసుకుంటే, అన్నీ సవ్యంగా జరిగి ఉండేవి. పుష్కరాలకు కేవలం ఒక నెల రోజుల ముందు పనులు మొదలుపెట్టడంతో అవి అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి. నాణ్యత ఎలాగూ లేదు. కనీసం భద్రత కూడా కరువయ్యే పరిస్థితి నెలకొంది. పుష్కరాల సమయంలో ఘాట్లు తడిగా, చిత్తడిగా ఉంటాయి. కాలేస్తే జారిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలోపెట్టుకుని ఘాట్ల నిర్మాణం చేపట్టాలి. అంటే వెడల్పు మెట్లను నిర్మించాల్సి ఉంది. కానీ సమయాభావం వలన, కాంట్రాక్టర్లు ఆ నిబంధనలేమీ పట్టించుకోలేదు. భక్తులు ఏమైపోతే తమకేంటన్న ధోరణిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విజయవాడలోని పద్మావతి, కృష్ణవేణి ఘాట్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి.
ఇవి పూర్తిగా నాశిరకంగా ఉన్నాయన్న విషయం ఒక్కసారి ఘాట్లను చూసినవారెవరైనా చెపుతారు. చాలా చోట్ల మెట్లు కనీసం అరి పాదం పట్టేంతకూడా లేకుండా నిర్మించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మెట్లపై నుంచి కిందకు దిగాలంటే ఇబ్బందికరంగానే ఉంది. ఆదమరిస్తే కిందకు దొర్లిపోయే పరిస్థితి ఉంది. ఇక వాటిపై టైల్స్ అతికిస్తే, పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పలేం. ఈ ఘాట్లో మెట్లు చాలా చోట్ల అష్ట వంకరలు తిరిగి ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఎత్తుపల్లాల్లో ఉన్నాయి. అలాగే నదిలో స్నానం చేసిన భక్తులు మళ్లీ పైకి రావాలంటే ఈ మెట్లను అంత సుళువుగా ఎక్కలేరు. వృద్ధులైతే, తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. మెట్లను ఎత్తుగా నిర్మించడం వలన అంత సుళువుగా ఎక్కలేని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా విజయవాడ బ్యారేజ్ను ఆనుకుని ఉన్న సీతానగరం ఘాట్లో శుక్రవారం పనులు జరగలేదు. ఈ ఘాట్లో పనులు 50 శాతం కూడా పూర్తికాకపోవడం, పనుల్లో నాణ్యత లేకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుసుకున్నారు. ఆ కాంట్రాక్టర్ను తప్పించి, వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని సిఎం గురువారం అధికారులకు ఆదేశించారు.