ఒకే ప్రాంతం నుంచి రెండుసార్లు భూములు లాక్కోవడం అన్యాయం
Published Saturday, 23 July 2016కొల్లాపూర్, జూలై 22: ఎంజికెఎల్ఐ పథకం ద్వారా భూములు కోల్పోయన రైతుల నుంచి మళ్లీ రెండోసారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం భూములు లాక్కోవడం అన్యాయమని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎంజికెఎల్ఐ పథకాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నార్లాపూర్, ఎల్లూరు, కుడికిళ్ల రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు ఆయనతో మాట్లాడుతూ ఎంజికెల్ఐ పథకం ద్వారా ఈ రెండు, మూడేళ్ల నుంచి పంటలు పండించుకుంటున్నామని, ఈ తరుణంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి మిగిలి ఉన్న కాస్తంత భూమిని ప్రభుత్వం లాక్కొంటోందని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వాలే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. అసలు ఇక్కడ ప్రాజెక్టు కట్టడమే అనవసరం అన్నారు. రెండుసార్లు రైతులు తమ భూములను కోల్పొయిన తరువాత ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చిన వారికి ఏమి ఫలితమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకొని పోవాల్సిందిపొయి, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులతో నష్టపోయే రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి డిజైన్ మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.