ప్రతి అక్షరం ఓ నిప్పు రవ్వ
Published Saturday, 23 July 2016హైదరాబాద్, జూలై 22: కవి డాక్టర్ దశరథి పద్యాల్లోని ప్రతి అక్షరం ఓ నిప్పురవ్వ అని అభివర్ణించారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. దాశరథి కృష్ణమాచార్య 92వ జయంతి ఉత్సవం శుక్రవారం ఉదయం రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహమూద్ అలీ మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అంటూ గొంతెత్తిచాటిన మహానీయుడు దాశరథి అని గుర్తుచేశారు. తెలంగాణ మహాకవుల గురించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే కానీ ప్రజలకు తెలియలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం కోసం నిజాం కాలంలో దాశరథి చేసిన కృషిని కొనియాడారు. దాశరథి పురస్కారం అందుకుంటున్న బాపురెడ్డి 50 దేశాలు పర్యటించి ఎన్నో పురస్కారాలు అందుకున్నారని పేర్కొన్నారు. అంతకు ముందు బాపురెడ్డిని సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దాశరథి మహా భాషా కోవిదుడని, ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు కోసం కృషి చేసిన వారిలో ఒకరని తెలిపారు. నిజాం కాలంలో దాశరథి ఇందూరు జైలులో ఉన్నప్పుడు జైలు గోడలపై రాసిన పద్యాలు మరుపురానివని, ఆ జైలు భవనాన్ని ప్రజల కోసం దాశరథి స్మారక భవనంగా నామకరణం చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్తో సంప్రదిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి రచనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి మాట్లాడుతూ దాశరథి ఆనాడు జైలు గోడలపై రాసిన పద్యాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. దాశరథి జయంతి రోజున బాపురెడ్డికి పురస్కారం ప్రదానం చేయడం విశేషమన్నారు. పురస్కార కమిటీ సభ్యుల్లో ఒకరైన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎ.శివారెడ్డి, ఎంఎల్సి సుధాకర్రెడ్డి, గిరిజన సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎస్సి కమిషన్ చైర్మన్ చల్లప్ప, దాశరథి లక్ష్మినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.