S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పడకేసిన ప్రచారం!

హైదరాబాద్, జూలై 22: కేంద్రం నుంచి తగినంత సహాయం రాకపోయినా, సంక్షేమం కోసం వేల కోట్లు వెచ్చిస్తు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, దానికి తగిన ప్రచారం రావడం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివిధ శాఖల సమాచారం, సమన్వయం కోసం లక్షలు పోసి నియమించుకున్న ఎంఎల్‌ఓ (మినిస్టర్స్ లైజనింగ్ ఆఫీసర్లు), పీఆర్‌ఓ వ్యవస్థ విఫలం కావడంతో పథకాల ప్రచారం జనంలోకి వెళ్లడం లేదన్న ఫిర్యాదులు ఇటీవలి కాలంలో సీఎం వరకూ వెళ్లినట్లు సమాచారం.
చంద్రబాబుకు, ప్రచారానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రచారం ఏవిధంగా నిర్వహించాలో చాలామంది జాతీయ నేతలు, సీఎంలు బాబును చూసి ఫాలో అవుతున్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత బాబు ప్రభుత్వం ప్రచారంలో వెనుకబడిపోవడం మంత్రులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తగిన బడ్జెట్ లేకపోవడం, ఉన్న సమాచారశాఖ అధికారుల్లో చురుకుదనం లేక, పాత ఆలోచనలతోనే పనిచేయడం, మంత్రులకు నియమించిన చాలామంది ఎంఎల్‌ఓ, పీఆర్‌ఓలు అంచనాకు తగినట్లు పనిచేయకపోవడం, పబ్లిసిటీకి తగిన బడ్టెట్ కేటాయించకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో బాబు కూడా ప్రచారం లోపించడంపై ఆరా తీశారని తెలిసింది.
కాగా, బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎల్‌ఓ వ్యవస్థను ప్రారంభించారు. వారికి దాదాపు నెలకు 25 వేల రూపాయల వరకూ జీతాలు ఇస్తున్నారు. వీరుకాకుండా, ముందే కొందరిని పీఆర్‌ఓలుగా నియమించారు. వీరికీ భారీ స్థాయిలోనే జీతాలు చెల్లిస్తున్నారు. వీరిలో ఇద్దరు ముగ్గురు తప్ప, మిగిలినవారెవరూ అంచనాకు తగినట్లు పనిచేయలేకపోతున్నారని సమాచారశాఖ ఉన్నతాధికారులు బాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మీడియాలో వివిధ స్థాయిలో పనిచేసే వారితో సత్సంబంధాలున్న స్థాయి వారెవరూ ఇందులో లేరని, తమ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు, ఆ కార్యకలాపాలు చూసిన వారికి ఈ బాధ్యతలు అప్పగించారని బాబుకు వివరించారు.
అసలు ఎంఎల్‌ఓలు ఎవరి అధీనంలో పనిచేస్తున్నారు? ఎవరికి జవాబుదారీ కూడా తెలియడం లేదన్నారు. కనీసం తమ మంత్రుల శాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త విషయాలను కూడా వీరు మీడియాకు కథనాల రూపంలో చేరవేయలేకపోతున్నారన్న అసంతృప్తి ఉంది. చాలామంది పిఆర్‌ఓ, ఎంఎల్‌ఓలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన వారే ఉన్నారని, వారికి స్క్రోలింగులు, మాస్ లైవ్ ప్యాకేజీలు వంటి క్లుప్తమైన అంశాలపై తప్ప, వాటిని గణాంకాలతో వివరించి మీడియాకు అందించే ఓపిక, రాసిచ్చే అనుభవం లేదని బాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అది కూడా ప్రచార లోపానికి మరోకారణమంటున్నారు.
కొందరు ఎంఎల్‌ఓలను చూసి మంత్రులు కూడా భయపడుతున్నారని, వారంతా తమ పేషీలో జరిగే రోజువారీ కార్యకలాపాలు, తమను కలిసేందుకు వచ్చిన వారి వివరాలను పార్టీ ఆఫీసుకు చేరవేసే నిఘా అధికారులుగా భావిస్తున్నారన్న వ్యాఖ్యలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. అదీకాకుండా వారిలో ఎక్కువమంది ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో మంత్రులు కూడా మనకెందుకులే అన్నట్లు మిన్నకుండిపోతున్నారు. జర్నలిస్టులు మంత్రులకు ఫోన్లు చేసిన వెంటనే, ఎంఎల్‌ఓలు అదే నెంబరుకు తిరిగి ఫోన్లు చేసి, మంత్రిగారికి ఎందుకు ఫోన్లు చేశారని అడుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని గమనించిన కొందరు మంత్రులు తమకు ఫోన్లు చేయవద్దని, నేరుగా వచ్చి మాట్లాడాలని జర్నలిస్టులకు స్పష్టం చేస్తున్నారు.
కాగా, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంపైనా బాబు దృష్టి సారిస్తున్నారు. ఇటీవలి కాలంలో సదావర్తి భూముల అమ్మకాలు, స్విస్ చాలెంజ్, బొగ్గు అమ్మకాలపై వివిధ పత్రికలు, చానెళ్లలో వచ్చిన వ్యతిరేక వార్తలకు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అధికారులపై బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, సమాచారశాఖకు తగిన బడ్జెట్ విడుదల చేయకపోవడం కూడా ప్రచార లోపానికి మరో ప్రధాన కారణమని, నిధులు ఇవ్వకుండా తమపై ఒత్తిడి చేస్తే ఫలితమేమిటని అధికారులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికి వందల కోట్లు ఖర్చు పెడుతుంటే, తమకు వందకోట్లు కూడా ఇవ్వకుండా, ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుదంటున్నారు.
కాగా సమాచారశాఖను పిఐబి తరహాలో నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్ఫలితాలిస్తున్నాయి. వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రచారం చేసేందుకు రూపొందించిన పరిశోధన-విశే్లషణ విభాగం పనితీరుపై సంతృప్తి వ్యక్తమవుతోంది. పిఐబిలో సుదీర్ఘకాలం పనిచేసిన వెంకటేశ్వర్ సమాచారశాఖ కమిషనర్‌గా వచ్చిన తర్వాత ఈ విభాగం ఏర్పాటయింది. పిఐబి కూడా కేంద్ర మంత్రిత్వశాఖల్లో జరిగే అభివృద్ధి కథనాలను వివరాలతో సహా పంపిస్తుంటుంది. ఇప్పుడు ఏపిలో కూడా అదే విధానం అమలుచేయడంతో చిన్న, మధ్య తరహా పత్రికలు, కొన్ని చానెళ్లకు సైతం అవి వార్తా కథనాలకు సమాచార సాధనంగా పనికివస్తోంది.