‘అవన్నీ జలయజ్ఞం ఫలాలే’
Published Saturday, 23 July 2016హైదరాబాద్, జూలై 22: తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలాలనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రారంభోత్సవాలు చేస్తున్నదని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించేందుకు వెళ్ళారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఉదహరించారు. అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రాజెక్టులను చేపట్టామని, వాటిలో 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్సాగర్ ప్రాజెక్టుల మొదటి దశ పనులను ప్రారంభించి జాతికి అంకితమిచ్చామని, ఇప్పుడు మంత్రి హరీశ్ రావు ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందని, దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన అనేక ప్రాజెక్టులు చాలా వరకు పూర్తయ్యాయని వాటిలో కొద్ది మేరకు నిధులు చేస్తే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.