భయపెడతున్న భారీ వాహనాలు
Published Monday, 25 July 2016శంఖవరం, జూలై 24: శంఖవరం మండలంలో గల గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ అండ్ బి రహదారులపై నేడు ప్రజలు, చిన్న వాహనాల కంటే భారీ వాహనాల రాకపోకలే విపరీతంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై 25 టన్నులకు మించి ప్రయాణించకూడదని ప్రభుత్వ నిబంధనలు తేటతెల్లం చేస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళనలు చేపట్టినప్పటికీ భారీ వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి తప్ప, తగ్గడం లేదు. ఎందుకంటే అధికారులు మైనింగ్దారుల జేబులో మనుషులుగా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజు శంఖవరం మీదుగా ప్రయాణిస్తున్న వాహనాలు భారీ లోడులతో ప్రయాణిస్తూండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే భారీ వాహనాల్లోని రాళ్లు, మట్టి, చిప్స్ రోడ్డు వెంబడి పడుతూనే ఉంటున్నాయి. వీటివల్ల చిన్న వాహనాలు జారి పడడం, వాహనాల టైర్లకు రాయి తగిలి రోడ్డు పక్కన వారికి గాయాలు కావడం సర్వసాధారణమైపోయింది. చిన్న, చితక తప్పులు చేసే వాహనాలకు భారీగా అపరాధ రుసుములు వసూలు చేసే రవాణాశాఖ అధికార్లకు నిత్యం వందల సంఖ్యలో తిరుగుతున్న ఈ భారీ వాహనాల రాకపోకలు ఎందుకు కనపడటం లేదోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శంఖవరం రహదారులపై నిత్యం ఆగిపోతున్న ఈ భారీ లారీల వల్ల ఉన్న కాస్త చిన్న రోడ్డు మూసుకుపోయినట్టే. దీంతో ప్రజలు ఇక్కట్లకు గురికావడం, ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేయడం సాధారణంగా మారింది.