పుష్కరాలకు పటిష్ఠ బందోబస్తు
Published Monday, 25 July 2016అమరావతి, జూలై 24: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చరిత్ర ప్రసిద్ధి గాంచిన అమరావతిలో పవిత్ర కృష్ణా నదికి ఆగస్టు 12 నుండి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు.
ఆదివారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి వచ్చి నండూరి సాంబశివరావు అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్లు, పుష్కరనగర్లు, అమరేశ్వరాలయాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నండూరి సాంబశివరావు మాట్లాడుతూ ఆగస్టు 1 నుండే ముఖ్యమైన ప్రదేశాల్లో ఇన్చార్జిలను ఏర్పాటు చేస్తామని, వారం ముందు నుండే అమరావతిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. స్నానఘాట్లు, మెయిన్ రోడ్డు, పుష్కర నగర్ల వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్, ఎస్పి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఎస్పి నారాయణ నాయక్, ఎఎస్పిలు భాస్కరనాయుడు, రామాంజనేయులు, సత్తెనపల్లి డిఎస్పి మధుసూదనరావు, అమరావతి సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ కె వెంకటప్రసాద్, శ్రీహరి తదితరులున్నారు.