మావోల హల్చల్
Published Monday, 25 July 2016వెంకటాపురం, జూలై 24: ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ వెంకటాపురం, చర్ల ప్రధాన రహదారిలో మావోయిస్టులు ఆదివారం తెల్లవారుజామున హల్చల్ చేశారు. అర్థరాత్రి రామచంద్రాపురం-మొర్రవానిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలో ప్లాస్టిక్బకెట్లలో రహదారికిరువైపులా బాంబులు అమర్చి రోడ్డుకు అడ్డుగా చెట్లకు తాళ్లను కట్టి రాకపోకలను అడ్డుకున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగే వారోత్సవాలను గ్రామగ్రామాన జరుపుకోవాలని పిలుపునిస్తూ అమరులైన వారి ఫోటోలతో కూడిన కరపత్రాలను రహదారిపై వెదజల్లారు. అర్థరాత్రి సమయంలో సాయుధులైన సుమారు 40 నుంచి 50 మంది వరకు మావోయిస్టులు ప్రధాన రహదారిపైకి చేరుకుని బాంబులు అమర్చి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. దీంతో వెంకటాపురం నుంచి చర్ల వైపు, అటువైపు నుంచి వెంకటాపురం వైపు వచ్చే వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారిపై నిలిచిపోయాయి. ఆయా వాహనదారులను సెల్ఫోన్లు ఆఫ్ చేయాలని, పోలీసులకు మాత్రం ఫోన్ చేయాలని హెచ్చరించినట్లు సమాచారం. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తాళ్లను కొంతమంది వాహనదారులు తొలగించి వాహనాల రాకపోకలకు వీలు కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఏఎస్పీ భాస్కరన్, వెంకటాపురం సిఐ, ఎస్సైలు, పోలీసు బలగాలు బాంబులు అమర్చిన ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. అమర్చిన బాంబుల్లో రెండింటిని మాత్రమే నిర్వీర్యం చేశారు. మిగతా వాటి కోసం వెతుకుతున్నారు. నిర్వీర్యం చేసే ప్రాంతానికి మీడియాను అనుమతించలేదు.