ప్రభుత్వానికి, మహిళలకు మధ్య వారధిగా పనిచేస్తా
Published Monday, 25 July 2016ఒంగోలు అర్బన్, జూలై 24: ప్రభుత్వానికి, మహిళలకు మధ్య వారధిగా పనిచేసేందుకు మంచి అవకాశం వచ్చిందని రాష్టమ్రహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి వెల్లడించారు. ఈసందర్భంగా ఆమె ఆదివారం విలేఖర్లతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే నివారించి బాధితులపై కఠినచర్యలు తీసుకుని, మహిళలకు న్యాయం చేస్తామన్నారు. ఇటీవల ఒంగోలు ప్రగతినగర్లో వికలాంగురాలిపై అత్యాచార యత్నం జరిగిందని, ఆమె కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈమధ్యకాలంలో ఫ్యామిలీ కేసుకు సంబంధించి తనవద్దకు వస్తే వెంటనే ఇరు కుటుంబాలను కూర్చోపెట్టి సమస్యను పరిష్కరించి బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం రాత్రి గుంటూరులోని వికాస్నగర్లో మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి అధ్యక్షతన ప్రమాణాస్వీకార మహోత్సవం జరిగిందన్నారు. అనంతరం మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు శక్తివంచన లేకుండా కృషిచేసి, మహిళలకు రక్షణగా నిలుస్తానని తెలిపారు. ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా తనవద్దకు రావాలని ఆమె సూచించారు. ఈసందర్భంగా మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికచేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్, మంత్రి శిద్దా రాఘవరావులకు కృతజ్ఞతలు తెలిపారు.