ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలి
Published Monday, 25 July 2016విజయనగరం, జూలై 24: ఉద్యానవన పంటలు పండించే రైతులకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. ఉద్యానవన పంటలు పండించే రైతులు పరస్పర సహాయ సంఘాలు ఏర్పాటు చేసుకుని లాభం పొందాలన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులు, ఉద్యాన పంటలు వేసే కొందరు రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ ఉద్యానవన రైతులు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం అందించే అన్ని రాయితీలను సక్రమంగా వినియోగించు కోవడంతోపాటు పంటల ఉత్పత్తి పెంచి దిగుబడులను ఎక్కువగా సాధించవచ్చనని అన్నారు. సహకార సంఘాల ద్వారా మార్కెటింగ్ సదుపాయాలను ఏర్పరచుకునేందుకు అవకాశం ఉందని, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఉద్యానవన పంటల కోసం డ్రిప్ ఇరిగేషన్, సోలార్ పంపులు, సేంద్రీయ ఎరువులు, నీటి యాజమాన్య పద్దతులు ఉపయోగించాలని చెప్పారు. ఉద్యాన వన పంటలలో అనుభవం ఉన్న రైతుల క్షేత్రాలకు మిగతా రైతులను తీసుకువెళ్లి అక్కడ అమలు చేస్తున్న సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సంఘాల వారీగా ఉద్యానవన రైతుల అవసరాలను గుర్తించి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో అమలు బాధ్యతను అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యాన వనశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ,అసిస్టెంటు డైరెక్టర్ లక్ష్మి, సహకార శాఖ అధికారి స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు.