విస్తరిస్తున్న ప్రైవేట్ రంగం
Published Monday, 25 July 2016హైదరాబాద్, జూలై 24: నూతన ఆర్థిక విధానాలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ప్రభుత్వరంగం కంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు. రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం జరిగిన జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాస సభకు జైట్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశంలో విదేశీ మారకం విలువ గణనీయంగా పెరిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థపై 1947-1991, 1991 నుంచి 2016 వరకు వేర్వేరుగా జరిపిన అధ్యయనాల్లో సరళీకృత విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటానికి దోహదం చేసినట్టు వెల్లడైందన్నారు. ప్రైవేట్ రంగంలో నైపుణ్యం, నిపుణత కలిగిన వారిని క్యాంపస్ ఇంటర్వ్యుల ద్వారా నియమించుకోవడం వల్ల సత్వర ఫలితాలు కనిపించాయన్నారు. టెలికామ్ రంగంలో ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక్కటే ఉన్నప్పుడు వినియోగదారుల సంఖ్య 0.8 శాతం మాత్రమే ఉండేదన్నారు. ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించిన తర్వాత వినియోగదారుల సంఖ్య 80 శాతం పెరిగిందని అరుణ్ జైట్లీ గుర్తు చేశారు. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు వంటి సంస్థల్లోనూ ఇదేరకమైన సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. న్యాయ, ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి న్యాయ వ్యవస్థ తోడుపడిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆర్బిఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి, ప్రొ. రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.