ఒలింపిక్స్లో నీరజ్కు చోటు
Published Monday, 25 July 2016న్యూఢిల్లీ, జూలై 24: అండర్-20 ప్రపంచ చాంపియన్షిప్స్లో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న రైజింగ్ అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రాకు వైల్డ్కార్డు ద్వారా వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభయమ్యే రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పించే విషయాన్ని పరిశీలించాలని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఎఎఫ్ఐ) ఆదివారం అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్)కు విజ్ఞప్తి చేసింది. పోలెండ్లోని బిడ్గోస్క్లో జరుగుతున్న అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో నీరజ్ చోప్రా 86.48 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడన్న వార్త తెలిసిన వెంటనే అతనికి రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ఐఎఎఎఫ్ అధ్యక్షుడు సెబాస్టియన్కోకు లేఖ రాశానని ఎఎఫ్ఐ అధ్యక్షుడు, అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య సభ్యుడు ఆదిల్ సుమరివాలా తెలిపాడు. నీరజ్ జూనియర్ల విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పినప్పటికీ ప్రస్తుత సీజన్లో ఉత్తమ ప్రదర్శనతో రాణించి ఐఎఎఎఫ్ జాబితాలో చోటు దక్కించుకున్న అథ్లెట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచాడని, అంతేగాకుండా 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ జావెలిన్త్రో ఈవెంట్లో పసిడి పతక విజేత కనబర్చిన ప్రదర్శన (84.58 మీటర్లు) కంటే ప్రస్తుతం నీరజ్ చోప్రా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉండటంతో అతనికి రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఐఎఎఎఫ్ అధ్యక్షుడికి లేఖ రాశానని సుమరివాలా వివరించాడు.