సిరిసిల్ల వేములవాడ రహదారిపై చైన్ స్నాచింగ్
Published Monday, 25 July 2016వేములవాడ, జూలై 25: వేములవాడ సిరిసిల్ల ప్రదాన రహదారిపై అగ్రహారం వద్ద టివిఎస్ ఎక్సెల్ వాహనంపై రాజన్న దర్శనానికి వస్తున్న దంపతులపై బైక్పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా గొలుసు లాక్కున్న సంఘటన సోమవారం సంచలనం సృష్టించింది. వేములవాడ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్మ తన భర్తతో కలిసి రాజన్న దర్శనార్థమై వస్తుండగా మార్గమధ్యంలోని అగ్రహారం సమీపంలో వెనకనుండి అపాచీ బైక్పై వచ్చిన ఇరువురు యువకులు మెరుపువేగంతో దాడిచేసి పద్మ మెడలోని గోలుసు కాస్త లాగేసుకుని అదేవేగంతో వెల్లిపోయారు. దీంతో పద్మ ఆమె భర్త ముందుకు పడిపోవడంతో గాయాలైనాయి. ఆ సమయంలో అక్కడ ఎవరులేకపోవడంతో దుండగులు వేగంతో పారిపోయారని, ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.