అమరావతికి మలేసియా నగిషీలు
Published Tuesday, 26 July 2016విజయవాడ, జూలై 25: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మలేసియా ఆర్కిటెక్ట్లు తాజా నమూనాలతో ముందుకొచ్చారు. మలేసియాకు చెందిన ఆర్డీఏ హారిస్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని భవనాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను సమర్పించారు. భవనాల ఆకృతులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు. విదేశాల్లో అనేక ప్రాజెక్ట్లను రూపొందించిన అనుభవం తమకుందని, దాన్ని రంగరించి అమరావతి ప్రభుత్వ భవనాల సముదాయానికి రూపకల్పన చేశామని కంపెనీ చైర్మన్ హారిస్ తెలిపారు. హారిస్ ఇంటర్నేషనల్ సేవల్ని తగినవిధంగా, తగిన సమయంలో ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధానిలో నిర్మించే ట్విన్ టవర్స్ ఎలా ఉండాలన్న అంశంపై కౌలాలంపూర్లోని పెట్రోనాస్ సహా వివిధ దేశాల్లోని ట్విన్ టవర్స్ నమూనాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హారిస్ చూపించారు. భవనాలన్నీ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళలు, బౌద్ధాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. అలాగే 21వ శతాబ్దపు ఆధునికత కూడా ఈ నమూనాల్లో ప్రతిఫలిస్తుందని హారిస్ చెప్పారు. అసెంబ్లీ భవనానికి ‘పవిత్ర సభ’ అన్న అర్థంలో ది సేక్రెడ్ అసెంబ్లీ అని పేరుపెట్టారు. సెక్రటేరియట్కు ‘పీపుల్స్ సెక్రటేరియట్’ అని, హైకోర్టుకు ‘టెంపుల్ ఆఫ్ జస్టిస్’ అని సూచనప్రాయంగా నామకరణం చేశారు. బౌద్ధ స్థూపాన్ని పోలినట్టుగా హైకోర్టు భవనాన్ని డిజైన్ చేశారు. రెండు బౌల్స్ న్యాయానికి సమతూకంగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ భవన మోడల్ను వాటర్ లిల్లీ ఆకృతిలో రూపొందించారు. ఈ కార్యక్రమంలో హారిస్ ఇండియా డైరెక్టర్ వంశీమోహన్, మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. ద సేక్రెడ్ అసెంబ్లీ