పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాల్సిందే
Published Tuesday, 26 July 2016కంఠేశ్వర్, జూలై 25: ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని, అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాదిగలకు నమ్మకం ఏర్పడుతుందని టి.ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట టి.ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలను ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే 100రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని ఎన్నికల సమయంలో బిజెపి చెప్పడం జరిగిందన్నారు. అందువల్ల ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. 341ఆర్టికల్ సవరణ విషయంలో కేంద్రం, రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదింపజేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కెసిఆర్కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని హితవు పలికారు.