పుష్కరాల్లో ప్రతిరోజూ 25వేల మందికి అన్నప్రసాదం
Published Tuesday, 26 July 2016తిరుమల, జూలై 25: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడలో టిటిడి ఏర్పాటుచేస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నాలుగంచెల విధానంతో దర్శనం కల్పించనున్నట్లు తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు. కృష్ణాపుష్కరాల్లో టిటిడి చేపడుతున్న ఏర్పాట్లకు సంబంధించి ఆయన తిరుమలలో అన్నదానం, ఆరోగ్యవిభాగం, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రతిరోజూ 25 వేల మందికి టిటిడి కల్యాణ మండపంలో అన్నప్రసాద వితరణ చేయనున్నామన్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగనున్న పుష్కరోత్సవాలకు అనుకున్న ప్రకారం పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కృష్ణాపుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు అక్కడే టిటిడి ఏర్పాటుచేసిన నమూనా శ్రీవారి ఆలయాన్ని దర్శిస్తారన్నారు.