డబుల్ బెడ్రూమ్ యూనిట్ ధర సడలింపు
Published Tuesday, 26 July 2016హైదరాబాద్, జూలై 25:రాజధాని నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో యూనిట్ ధర మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ఎత్తు విషయంలోనూ నిబంధనలు మార్చనున్నారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సోమవారం కలిసి చర్చించారు. నిబంధనలను సడలిస్తే 30 వేల ఇళ్లను నిర్మించడానికి ఉన్న అవకాశాన్ని చర్చించారు. హైదరాబాద్కు సంబంధించినంత వరకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. వీటిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. మెట్రోరైలు పురోగతిపై చర్చించారు. మెట్రోకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల్లో కొంత వాటా ఈ వారంలో విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సమావేశంలో జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.